ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో మరోసారి భూప్రకంపనలతో జనం భయాందోళనలకు గురయ్యారు. బుధవారం ఉదయం నాలుగు మండలాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దుత్తలూరు, వింజమూరు, వరికుంటపాడు మండలాలతోపాటు మర్రిపాడు మండలంలో భూ ప్రకంపనలు సంభవించాయి. పలు గ్రామాల్లో మూడు సెకన్ల నుంచి ఐదు సెకన్లపాటు స్వల్పంగా భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భూ ప్రకంపనలతో ఇళ్లల్లోని వస్తువులు కదలడంతో భయంతో జనం బయటకు పరుగులు తీశారు. ఆ తర్వాత కాసేపటి తర్వాత మళ్లీ ఇళ్లకు చేరుకున్నారు. స్వల్పంగానే భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఒకేసారి నాలుగు మండలాల్లో భూమి కంపించడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా పలుమార్లు నెల్లూరు జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు
July 13, 2022
0
Tags