ఇండోర్‌ గాంధీ స్మారక వైద్య కళాశాల సీనియర్ల వికృత ర్యాగింగ్ !

Telugu Lo Computer
0


మధ్య ప్రదేశ్‌ లోని ఇండోర్‌లోని మహాత్మా గాంధీ స్మారక వైద్య కళాశాలలో సీనియర్లు అసహజ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనాలని జూనియర్లను అత్యంత అనాగరికంగా వేధిస్తున్నట్లు కేసు నమోదైంది. అసభ్యకరంగా, అశ్లీలంగా ప్రవర్తించాలంటూ తీవ్రంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు నమోదయ్యాయి.ఇండోర్ పోలీసులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం,  మహాత్మా గాంధీ స్మారక వైద్య కళాశాల లో ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్  హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు. తమ సీనియర్ విద్యార్థులు తమను అత్యంత కిరాతకంగా వేధిస్తున్నారని ఆరోపించారు. అసభ్యకరంగా, అశ్లీలంగా ప్రవర్తించాలని వేధించడంతోపాటు, తమను అసహజ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనాలని నిర్బంధిస్తున్నారని ఆరోపించారు. ఈ కళాశాల అధికారులు అందజేసిన లేఖపై స్పందిస్తూ సంయోగితా గంజ్ పోలీసులు కొందరు గుర్తు తెలియని ఎంబీబీఎస్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. యూజీసీ (UGC) యాంటీ ర్యాగింగ్ యూనిట్ అందజేసిన సమాచారం మేరకు ఈ కళాశాల అధికారులు స్పందించి, పోలీసులకు లేఖ రాశారు. బాధిత విద్యార్థులు తమ ఫిర్యాదుతోపాటు కొన్ని ఫొటోలు, ఆడియో రికార్డింగులను కూడా జత చేశారు. వేధింపులకు పాల్పడుతున్న సీనియర్ విద్యార్థుల ఫ్లాట్ల లొకేషన్‌ను కూడా షేర్ చేశారు. ఈ ఫ్లాట్లలో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తరగతులు ముగిసిన తర్వాత తమను వారు నివసిస్తున్న ఫ్లాట్లకు రావాలని సీనియర్లు ఆదేశిస్తున్నారని జూనియర్లు తెలిపారు. సీనియర్ల ఫ్లాట్లకు ఆలస్యంగా వెళ్ళే జూనియర్ల చేత గుంజీలు తీయిస్తున్నారని తెలిపారు. ఈ హింస, వేధింపులు చాలా దారుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. తమ తోటి విద్యార్థినుల గురించి అశ్లీలంగా మాట్లాడేలా నిర్బంధిస్తున్నారని, ఒకరినొకరు చెంప దెబ్బలు కొట్టుకోవాలని హింసిస్తున్నారని పేర్కొన్నారు. చెంప దెబ్బ శబ్దం సీనియర్లకు సంతృప్తికరంగా ఉండే వరకు కొట్టుకోవాలని నిర్బంధిస్తున్నట్లు తెలిపారు. ఈ ర్యాగింగ్ కేవలం సీనియర్ల ఫ్లాట్లకు మాత్రమే పరిమితం కాలేదని, గ్రంథాలయం, కేంటీన్ వంటివాటికి కూడా తమను వెళ్ళనివ్వడం లేదని జూనియర్లు ఆరోపించారు. చివరికి వాటర్ కూలర్లలో నీటిని సైతం తాగనివ్వడం లేదన్నారు. ఈ దుర్మార్గాలను కొందరు ప్రొఫెసర్లు కూడా సమర్థిస్తున్నారని, వ్యక్తిత్వ వికాసం అని అభివర్ణిస్తున్నారని చెప్పారు. ఎంజీఎంఎంసీ డీన్ డాక్టర్ సంజయ్ దీక్షిత్ మాట్లాడుతూ, తమకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు అందిన వెంటనే యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించామన్నారు. ప్రథమ సమాచార నివేదికను ఎండార్స్ చేసి, ఓ లేఖను పోలీసులకు పంపించామని చెప్పారు. పోలీసులు తన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారని, ప్రథమ సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థుల వివరాలను కోరారని, డే బోర్డర్స్, హాస్టలర్స్ వివరాలు కోరారని చెప్పారు. దాదాపు ఓ నెల క్రితం హాస్టల్ నుంచి వెళ్లిపోయిన విద్యార్థుల వివరాలను కోరారని చెప్పారు. సంయోగితగంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి తెహజీబ్ కాజీ మాట్లాడుతూ, సీఆర్‌పీసీ సెక్షన్ 91 ప్రకారం తాము నోటీసు జారీ చేశామన్నారు. దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)