రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్మూ వైకాపా ప్రజా ప్రతినిధులను కోరారు. తాను అడగకముందే మద్దతిచ్చారంటూ కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక న్యాయంలో భాగంగా ముర్మూకు ఓటు వేయాలని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు జగన్ నిర్దేశించారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్మూకు ఘన స్వాగతం లభించింది. కేంద్రమంత్రి కిషన్రెడ్డితో కలిసి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆమెకు విజయసాయిరెడ్డి సహా పలువురు వైకాపా ఎంపీలు, భాజపా నేతలు సోము వీర్రాజు, సీఎం రమేష్ తదితరులు స్వాగతం పలికారు. గిరిజన సంప్రదాయ కళాకారులు నృత్యాలతో ఆహ్వానించారు. అనంతరం రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ముర్మూకు సీఎం జగన్ దంపతులు ఎదురేగి స్వాగతం పలికారు. అక్కడ తేనీటి విందు అనంతరం.. అంతా కలిసి మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్కు వెళ్లారు. వైకాపా ప్రజాప్రతినిధులకు ముర్మూను సీఎం జగన్ పరిచయం చేశారు. ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని వైకాపా ప్రజాప్రతినిధులను ముర్మూ కోరారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విశిష్టతలను కొనియాడిన ముర్మూ.. రాష్ట్రంలోని కవులు, కళాకారులు, స్వాతంత్ర్య సమరయోధుల గొప్పతనాన్ని ప్రశంసించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైకాపా ప్రజాప్రతినిధులెవరూ గైర్హాజరవ్వకుండా విప్లు బాధ్యత తీసుకోవాలని సీఎం నిర్దేశించారు. ఈ సందర్భంగా వైకాపా ప్రజాప్రతినిధులకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
వైకాపాకు ద్రౌపదీ ముర్మూ కృతజ్ఞతలు
July 13, 2022
0
Tags