చిన్నవయస్సులో మరణించిన వారికి 30 ఏళ్ల తర్వాత పెళ్లి!

Telugu Lo Computer
0


కర్ణాటకలో మరణించిన వారికి 30 ఏళ్ల తర్వాత పెళ్లి తంతు నిర్వహించే సంప్రదాయం ఉంది. దక్షిణ కర్ణాకటలోని కొన్ని ప్రాంతాల్లో చాలా ఏళ్లుగా ఈ తంతు జరుగుతోంది. దీనికి సంబంధించిన వివరాల్ని అన్నీ అరుణ్ అనే యూట్యూబర్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. కొంతమంది పిల్లలు పుట్టగానే లేదా చిన్న వయసులోనే మరణిస్తుంటారు. అందులో కొందరు ఆడ శిశువులు, ఇంకొందరు మగ శిశువులు ఉండొచ్చు. అలా మరణించిన పిల్లల తల్లిదండ్రులే తమ పిల్లల పేరు మీద, వారి తరఫున ఈ పెళ్లి జరిపిస్తారు. తమ పిల్లలు బతికుంటే పెళ్లి వయసు వచ్చి ఉండేది అని భావించినప్పుడు ఈ పెళ్లికి సిద్ధమవుతారు. ఈ సంప్రదాయం ప్రకారం పుట్టగానే పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు, తమలాగే పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రుల గురించి తెలుసుకుంటారు. అలా మగ బిడ్డను పోగొట్టుకున్న వాళ్లు, ఆడ బిడ్డను పోగొట్టుకున్నవాళ్లతో.. ఆడ బిడ్డను కోల్పోయిన వాళ్లు, మగ బిడ్డను కోల్పోయిన వాళ్లతో చర్చలు జరుపుతారు. పుట్టిన తేదీతోపాటు ఇతర వివరాలు తెలుసుకుంటారు. వరుడి వయసు వధువు కంటే ఎక్కువ ఉండాలనే పద్ధతిని కూడా ఫాలో అవుతారు. అలా చిన్నారుల్ని కోల్పోయిన తల్లిదండ్రులు తమ పిల్లల పేర్లతో సంబంధం కలుపుకొంటారు. ఇరు కుటుంబాలు అంగీకరిస్తే పెళ్లికి సిద్ధమవుతారు. స్థానిక సంప్రదాయం ప్రకారం పిల్లల పేరు మీద తల్లిదండ్రులే ఈ పెళ్లి తంతు పూర్తి చేస్తారు. అలాగని ఈ పెళ్లిని ఆషామాషీగా జరిపేయరు. పూర్తి సంప్రదాయం ప్రకారం ఘనంగా నిర్వహిస్తారు. బంధుమిత్రుల్ని కూడా పిలుస్తారు. కొత్త బట్టలు పెట్టుకుంటారు. పెళ్లి అనంతరం ఘనంగా విందు భోజనం కూడా ఏర్పాటు చేస్తారు. అయితే ఈ పెళ్లికి చిన్న పిల్లల్ని, పెళ్లి కాని యువకులను పిలవరు. పెళ్లైనవాళ్లు మాత్రమే హాజరవుతారు. ఇటీవల ఒక పెళ్లికి సంబంధించి వధువు వయస్సు వరుడి కంటే ఎక్కువ ఉండటంతో ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందట. ఏదేమైనా ఈ ఆచారం గురించిన సమాచారం ఇప్పుడు కర్ణాటక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)