తనిష్క్ సేల్స్ గర్ల్ తుపాకులతో కాల్చివేత

Telugu Lo Computer
0


బీహార్ లోని బెగుసరాయ్ జిల్లాలో నేహా అనే 27 ఏళ్ల యువతి బెగుసరాయ్‌లోని తనిష్క్‌ షో రూమ్‌లో సేల్స్ గర్ల్‌గా పని చేస్తోంది. నేహా ఆదివారం పని ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో బైక్‌పై వచ్చిన కొందరు తుపాకులతో కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన నేహాను హాస్పిటల్ కు తరలించారు. అయితే తీవ్ర గాయాలతో నేహా మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. నేహా హత్య వెనుక ఆమె భర్త హస్తం ఉన్నట్లు బాధితురాలి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లోహియానగర్ ప్రాంతంలోని ఆనంద్‌పూర్ గ్రామానికి చెందిన 27 ఏళ్ల నేహాకు 2011లో లఖిసరాయ్‌లోని రాంపూర్‌ గ్రామానికి చెందిన ఇషాంక్‌ భరద్వాజ్‌తో వివాహమైంది. అయితే ఈ పెళ్లిపై ఇషాంక్‌ కుటుంబ సభ్యులు అసంతృప్తితో ఉన్నారు. దీంతో అతడు భార్యతో కలిసి అత్తమామల ఇంట్లో ఉన్నాడు. ఐదేళ్లపాటు అంతా సవ్యంగానే సాగింది. ఈలోగా వీరికి ఒక కొడుకు కూడా జన్మించాడు. అయితే 2016 తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో భర్త.. అత్తమామల ఇళ్లు వదిలి వెళ్లిపోయాడు. అయితే కొంతకాలంగా నేహాకు భర్త ఇషాంక్ ఫోన్ల మీద ఫోన్లు చేసి తనతో కొంత సమయం గడపమని నేహాని కోరేవాడు. అయితే భర్త చెప్పినదానికి నేహా అంగీకరించలేదు. ఈ క్రమంలో తన మాట వినకపోతే చంపేస్తాను అని నేహాను బెదిరించేవాడు. ఈ విషయాన్ని నేహా తన తల్లి రింకూదేవితో కూడా పలుసార్లు చెప్పింది. ఇటీవల కొందరు తనను వెంబడిస్తున్నారని, భయంగా ఉందంటూ కుమార్తె తనకు చెప్పినట్లు పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది.నేహాపై కాల్పుల వెనుక అతడి భర్త హస్తం ఉండి ఉండవచ్చని బాధితురాలి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీహార్‌లో శాంతిభద్రతల పరిస్థితి ఎల్లప్పుడూ ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగ సమస్యను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సీఎం నితీశ్ కుమార్ పరిశ్రమలను ఆహ్వానిస్తున్న తరుణంలో ఈ ఘటన మళ్లీ రాష్ట్రంలో మహిళల భద్రతపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తింది.

Post a Comment

0Comments

Post a Comment (0)