రాజస్థాన్ లోని సుంత్రా జిల్లా జాలోర్ తాలుకా వారన్వా గ్రామానికి చెందిన జెన్ సింగ్ అలియాస్ మనోహర్ సింగ్ జూన్ 8న ముంబైలోని ఛత్రపతి శివాజి టెర్మినస్ నుంచి మంగళూరు వెళ్లే రైలు ఎక్కాడు. రైలు మహారాష్ట్ర సరిహద్దు దాటింది. ప్రయాణికులందరినీ టికెట్ చూపించమని టీసీ అడిగాడు. కానీ అతడి వద్ద లేదు. లంచం ఇచ్చేందుకు ప్రయత్నించాడు. టికెట్ కలెక్టర్కు ఏదో తేడాగా అనిపించింది. వెంటనే చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్కు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత రైల్వే ఇన్స్పెక్టర్ విపిన్ సింగ్ రాణా రైలు ఎక్కి జన్సింగ్ వద్దకు వెళ్లాడు. టికెట్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించాడు. అతడు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో.. పోలీసులకు అనుమానం వచ్చింది. బ్యాగ్లో ఏమున్నాయని అడిగితే, బట్టలు తప్ప ఏమీ లేవని సమాధానం చెప్పాడు. కానీ పోలీసులు నమ్మలేదు. బ్యాగ్ తెరిచి చూస్తే అందులో నోట్ల కట్టలు కనిపించాయి. మొత్తం రూ.2 కోట్ల నగదు ఉందని పోలీసులు తెలిపారు. అన్నీ రూ.2వేల నోట్లే ఉండడం విశేషం. ఆ డబ్బునంతా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైలు కర్వార్లోని శిరవాడ రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత రైల్వే పోలీసులు అతడిని స్థానిక పోలీసులకు అప్పజెప్పారు. అంత డబ్బు ఎక్కడిది? ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? అని కూపీ లాగితే ఆసక్తికర విషయాలు తెలిశాయి. అదంతా హవాలా డబ్బుని, మంగళూరులో ఓ వ్యక్తికి ఇచ్చేందుకు తీసుకెళ్తున్నాడని తెలిసింది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడు ఇచ్చిన వివరాల ఆధారంగా పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
టికెట్ తీసుకోకపోవడమే కొంప ముంచింది !
June 11, 2022
0
Tags