ఈపీఎఫ్‌వో చందాదారులకు ఈ-నామినేషన్‌ తప్పనిసరి !

Telugu Lo Computer
0


ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) చందాదారులకు ఈ-నామినేషన్‌ ను తప్పనిసరి చేసింది. తాజాగా ఆ వివరాలు నమోదు చేసేవరకు సేవలు పొందకుండా ఆంక్షలు విధించింది. ఈ-నామినేషన్‌ పూర్తి చేసిన చందాదారులే ఆన్‌లైన్‌ సేవలు పొందవచ్చని స్పష్టం చేస్తోంది. ఇప్పటికే ఆన్‌లైన్‌ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చిన సంస్థ.. భవిష్యత్తులో మరింత సులభతరంగా సేవలు అందేలా చర్యలు చేపట్టామని ఈపీఎఫ్‌వో చెబుతోంది. ముఖ్యంగా ఈపీఎఫ్‌ చందాదారుడు చనిపోయినపుడు వారసులకు ఈపీఎఫ్‌ మొత్తం, పింఛను, ఉద్యోగి డిపాజిట్‌ ఆధారిత బీమా(ఈడీఎల్‌ఐ) అందించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించేందుకు ఈ-నామినేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈపీఎఫ్‌వో చందాదారులు ఈ-నామినేషన్‌ వివరాలను నమోదు చేసుకోవాలని గత కొంతకాలంగా సూచిస్తూ వస్తోంది. ఇందుకు 2021 డిసెంబరు 31ను గడువని పేర్కొంది. అయినప్పటికీ కోట్ల మంది చందాదారులు వివరాలు నమోదు చేయలేదు. చివరి నిమిషంలో సర్వర్‌పై ఒత్తిడి పెరగడంతో సాధ్యం కాలేదు. దీంతో డిసెంబరు 31 తర్వాత ఈ-నామినేషన్‌ నమోదుకు సంస్థ అనుమతి ఇచ్చింది. ఈపీఎఫ్‌వో మెంబర్‌ పోర్టల్‌లో యూఏఎన్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ కావాలి. ప్రొఫైల్‌లో చందాదారుడి వ్యక్తిగత వివరాలు, ఫొటో అప్‌లోడ్‌ చేయాలి. మేనేజ్‌లో ఈ-నామినేషన్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి. వారసుల వివరాలు, ఆధార్‌ సంఖ్య, పేరు, పుట్టిన తేదీ, చిరునామా, బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయాలి. వారసుల ఫొటోలు అప్‌లోడ్‌ చేయడంతో పాటు వారికి నగదు నిల్వల్లో వాటా స్పష్టంగా పేర్కొనాలి. ఈ-సైన్‌ ఆప్షన్‌ ఎంచుకుని చందాదారుడి ఆధార్‌ నంబరు నమోదు చేయాలి. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్‌ నంబరుకు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేస్తే ఈ-నామినేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)