రాజీవ్ హంతకుడి విడుదలపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి

Telugu Lo Computer
0


రాజీవ్ గాంధీ హంతకుడు ఏజీ పెరారివాలన్‌ను విడుదల చేయడంపై కాంగ్రెస్ తీవ్ర ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం చిల్లర, చౌకబారు రాజకీయాలకు పాల్పడిందని మండిపడింది. ఓ మాజీ ప్రధాన మంత్రి హంతకుడి విడుదల కోసం కోర్టులో ఓ విధమైన పరిస్థితిని ప్రభుత్వం సృష్టించిందని ఆరోపించింది. కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా బుధవారం మాట్లాడుతూ, మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హంతకుడు ఏజీ పెరారివాలన్‌ను విడుదల చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే కాకుండా భారత దేశం, భారతీయతలపై నమ్మకం గల ప్రతి పౌరుడు తీవ్ర విచారం, ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఉగ్రవాది ఉగ్రవాదేనని, ఉగ్రవాదిని ఉగ్రవాదిగానే చూడాలని అన్నారు. రాజీవ్ గాంధీ హంతకుడిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో తాము తీవ్ర ఆవేదన, అసంతృప్తికి గురయ్యామని తెలిపారు. ఓ మాజీ ప్రధాన మంత్రిని హత్య చేసిన వ్యక్తిని విడుదల చేయడం అత్యంత దురదృష్టకరం, ఖండనార్హం అని చెప్పారు. నేడు దేశానికి అత్యంత విషాదకర దినమని చెప్పారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మాత్రమే కాకుండా భారత దేశం, భారతీయతలపై నమ్మకం గల ప్రతి భారత దేశ పౌరుడు తీవ్ర విచారం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. తీవ్రవాదంపై పోరాటంలో, భారత దేశ సార్వభౌమాధికారం, సమగ్రతలను సవాలు చేసే ప్రతి శక్తితోనూ పోరాడటంలో నమ్మకంగల ప్రతి ఒక్కరూ విచారం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. లక్షలాది మంది దోషులు జీవిత ఖైదును అనుభవిస్తున్నారని, వారిని కూడా విడుదల చేస్తారేమోనని అన్నారు. ఇది రాజీవ్ గాంధీ గురించి ప్రశ్న కాదని, హత్యకు గురైన ఓ ప్రధాన మంత్రి గురించి అని చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే ప్రతి వ్యక్తి మనసు గాయపడిందన్నారు. రాజీవ్ గాంధీ దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తన చిల్లర, చౌకబారు రాజకీయాల కోసం ఆయన హంతకులను విడుదల చేసే పరిస్థితిని కోర్టులో సృష్టించినట్లయితే, అది అత్యంత దురదృష్టకరమని, ఖండించదగినదని అన్నారు. తాము సాధ్యమైనంత తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నామన్నారు. నేడు ఎలాంటి ప్రభుత్వం ఉందో, తీవ్రవాదంపై దాని వైఖరి ఏమిటో భారతీయులంతా తెలుసుకోవాలన్నారు. రాజీవ్ గాంధీ హంతకుడు పెరారివాలన్ దాదాపు 30 సంవత్సరాలపాటు జైలు శిక్ష అనుభవించాడు. ఈ కేసులోని మొత్తం ఏడుగురు దోషులను శిక్షాకాలం పూర్తి కాకుండానే విడుదల చేయాలని తమిళనాడు మంత్రివర్గం సిఫారసు చేసింది. మంత్రివర్గం ఇచ్చిన సలహాకు అనుగుణంగా గవర్నర్ పని చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. భారత రాజ్యాంగం లోని అధికరణ 142 ప్రకారం తనకుగల అసాధారణ అధికారాలను వినియోగిస్తూ పెరారివాలన్‌ను విడుదల చేయాలని బుధవారం ఆదేశించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)