వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఎనిమిది మంది మృతి

Telugu Lo Computer
0


తెలంగాణలోని వరంగల్​, మేడ్చల్​, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వరంగల్‌లోని ఖమ్మం బైపాస్‌ హంటర్‌ రోడ్డు ఫ్లైఓవర్‌ నుంచి కారు కిందపడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఎంజీఎంలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. మృతిచెందిన వారిని ప్రభుత్వ ఉద్యోగి సారయ్య(42), ఆయన భార్య సుజాత(39)గా గుర్తించారు. ఖమ్మం నుంచి వరంగల్‌ వైపు వస్తున్న కారు ఫ్లైఓవర్‌ మీద మరో కారును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరూ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వద్ద ఈ తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరు మహిళలతో పాటు డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందారు. ఆటో డ్రైవర్‌ను తిమ్మాపూర్‌కు చెందిన బబ్లూగా గుర్తించారు. మృత దేహాలను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటన గురించి అంబులెన్స్‌ సిబ్బందికి ఎవరూ సమాచారం ఇవ్వకపోవడంతో మృతదేహాలు సుమారు మూడు గంటల పాటు రోడ్డుపైనే ఉన్నాయి. అనంతరం పోలీసులకు సమాచారం అందడంతో వారు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలోని దాసుతండా సమీపంలో ఆదివారం తెల్లవారుజామున బైక్‌ను వెనుకవైపు నుంచి వచ్చిన బొగ్గు టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులను మండలంలోని ఎర్రాయిగూడెంకి చెందిన ఈసం హనుమంతు (34), ఈసం స్వామి (42)గా గుర్తించారు. వీరిద్దరూ పెళ్లిలో భాజా మోగించి.. బైక్‌పై స్వగ్రామానికి తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో దాసుతండా దాటగానే వెనుకాల నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. హనుమంత్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా స్వామి చనిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టేకులపల్లి ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. మేడ్చల్‌ జిల్లా సూరారంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బహదూర్‌ పల్లి నుంచి సూరారం వైపు వస్తున్న డీసీఎం.. కాలనీ నుంచి రోడ్డు పైకి వస్తున్న ఓ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం ముందు భాగం నుజ్జునుజ్జవ్వగా క్లీనర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న దుండిగల్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)