విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో వైఎస్ఆర్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ భేటీకి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మంత్రి గుడివాడ అమర్నాథ్, మంత్రి విడదల రజనీ, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సహా వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, హాజరయ్యారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రజలకు గుర్తుచేయాలని వైసీపీ నేతలకు సూచించారు. చంద్రబాబు ఎన్నో అబద్దపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాడని, పాదయాత్ర సందర్భంగా పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలనను మించేలా జగన్ మోహన్ రెడ్డి పాలన సాగుతోందన్నారు. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి తలకిందులైందని, అయినా ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని పారదర్శకతతో పథకాలు అమలు చేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. జగన్ సంక్షేమ పాలన చూసి ఓర్వలేక చంద్రబాబు, ఆయన కుమారుడు, పచ్చ మీడియా విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కరువు మేఘాలు తీసుకువస్తాడని వైవీ సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నెలరోజులకే హుద్ హుద్ తుఫాను వచ్చిందని గుర్తుచేశారు. ఇన్ని పథకాలు అమలు చేస్తున్నందుకు జగన్ను ఐరన్ లెగ్ అని ఆరోపిస్తారా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు జగన్ ప్రవేశపెట్టిన పథకాలు చంద్రబాబు ఆయన జీవితంలో ఎప్పుడైనా అమలు చేశారా అని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వంపై జరుగుతున్న విష ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలందరిపై ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వ పథకాల వల్ల జరుగుతున్న మేలును ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఈనెల 11వ తేదీ నుంచి గడప గడపకు కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. విశాఖ జిల్లాలో ఉన్న 6 స్థానాలు గెలవాలన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన ప్రతి కార్యకర్తకు మేలు జరుగుతుందని సమన్వయ కర్తగా ఇది తన బాధ్యత అని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.
11 నుంచి గడప గడపకు 'వైఎస్ఆర్ కాంగ్రెస్'
May 07, 2022
0
Tags