తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ ?

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. ధనిక రాష్ట్రమని ప్రభుత్వం పదే పదే చెప్తున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అప్పుల మీద అప్పులు చేయడం, రాబడికి మించి ఖర్చులు పెట్టడంతో గల్లా పెట్టె ఘొల్లుమంటున్నది. ఎనిమిదేండ్లలో ఎన్నడూ లేనంత కటకటను ఆర్థిక శాఖ ఎదుర్కొంటున్నది. 18వ తారీఖు దాటినా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆసరా పింఛన్లు అందడం లేదు. ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్​ ఉద్యోగులకు పెన్షన్ల చెల్లింపుల కోసం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. మళ్లీ అప్పులు తెస్తే కానీ, పెద్ద ఎత్తున ఆస్తులు, భూములు అమ్మితే కానీ గండం గట్టెక్కే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఏప్రిల్​, మే, జూన్​ నెలల్లోనే రూ. 15 వేల కోట్లు అప్పు కావాలని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంక్​కు ఇండెంట్​ పెట్టింది. .బడ్జెట్‌ లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చులు, అమల్లో ఉన్న స్కీమ్​లన్నీ సక్రంగా జరపాలంటే యావరేజ్​గా నెలకు రూ.19 వేల కోట్లు అవసరం. జీఎస్టీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, లిక్కర్ అమ్మకాలు, పెట్రోల్​, డీజిల్​ అమ్మకాలు, రాష్ట్రాల పన్నుల వాటా.. అన్నీ కలిపితే వచ్చేది రూ.12 వేల కోట్లు మించటం లేదు. మిగతా లోటు పూడ్చేందుకు ప్రభుత్వం అప్పులు తేవటంతో ఖజానాపై మోయలేనంత భారం పడుతున్నది. ఇప్పటికే అప్పుల మొత్తం రూ. 4 లక్షల కోట్లు దాటడంతో ప్రతి నెలా వడ్డీలు, కిస్తీలకు ప్రభుత్వం రూ. 1,850 కోట్లు చెల్లిస్తున్నది. అప్పులమీద అప్పులు పేరుకుపోవటం, రాబడికి మించి ఖర్చు ఉండటంతో నెల నెలా జీతాలు, నిర్వహణ ఖర్చులకు కటకట మొదలైంది. దళిత బంధుకు, జూన్​ ఫస్ట్ వీక్​లో ఇవ్వాల్సిన రైతు బంధుకు కావాల్సిన నిధుల సర్దుబాటు కోసం ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్ తారీఖున జీతాలు రావటం కలగా మారింది. ఈ నెలలో 15వ తారీఖు నాటికి పది జిల్లాలకు జీతాలు అందలేదు. ఒక్కో రోజు ఒకటీ రెండు జిల్లాలకు శాలరీలు విడుదల చేశారు. ఇప్పటికీ మూడు జిల్లాల్లో కొందరు ఉద్యోగులకు జీతాలు అందలేదు. అన్ని డిపార్టుమెంట్లలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్​ సోర్సింగ్ ఉద్యోగులకు ట్రెజరీలోనే బిల్లులు నిలిచిపోయాయి. తాను 36 ఏండ్లుగా సర్వీసులో ఉన్నానని, ఏనాడూ ఈ పరిస్థితి రాలేదని వరంగల్​ జిల్లాకు చెందిన ఒక హెడ్మాస్టర్​ ఇప్పుడున్న పరిస్థితిని తలుచుకున్నారు. కరోనా బిల్లులకు సంబంధించి రీ యింబర్స్​మెంట్​ బిల్లులు ఇప్పటికీ శాంక్షన్​ కాలేదని, వేల సంఖ్యలో పెండింగ్​లో ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)