పశ్చిమబెంగాల్ లోని జల్పాయ్గురి జిల్లాలో రోడ్లపై కంగారులు ప్రత్యక్షమయ్యాయి. వీటిని చూసిన స్థానికులు షాక్ అయ్యారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరిన అటవీశాఖ అధికారులు మూడు కంగారులను తమ సంరక్షణలోకి తీసుకున్నారు. జల్పాయ్గురి జిల్లాలోని గజోల్డోబా ప్రాంతంలో రెండు, సిలిగురిలో ఒక కంగారును కాపాడినట్లు బైకుంత్పూర్ ఫారెస్ట్ డివిజన్ రేంజర్ సంజయ్ దత్ తెలిపారు. చనిపోయిన మరో కంగారును గుర్తించామని తెలిపారు. కంగారుల శరీరాలపై గాయాలున్నాయని చికిత్స కోసం బెంగాల్ సఫారీ పార్క్కు తరలించామని తెలిపారు. ఆ కంగారులను స్థానికంగా చూడటంతో అటవీశాఖ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. అవి వాటి సహజ ప్రదేశాలను వదలి ఎలా వచ్చాయి? వాటి శరీరంపై గాయాలు ఎందుకున్నాయి? అనే దానిపై దర్యాప్తు చేపట్టారు. మరోవైపు స్మగ్లర్లు కంగారులను తరలించి ఉంటారని డీల్ కుదరకపోవడంతో వాటిని అటవీ ప్రాంతంలో వదిలేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై దర్యాప్తు కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేసామని బైకుంత్పూర్ ఫారెస్ట్ డివిజన్ రేంజర్ సంజయ్ దత్ తెలిపారు. రోడ్లపై కనిపించిన కంగారుల ఫొటోలు, వీడియోలు తీసిన కొందరు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అవి వైరల్ అయ్యాయి. మన దేశంలోని జూకు చెందినవి కావని ఎవరో వీటిని నేపాల్కు స్మగ్లింగ్ చేయబోయి ఈ ప్రాంతంలో విడిచిపెట్టి ఉంటారని అటవీశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్లపై ప్రత్యక్షమైన కంగారులు !
April 05, 2022
0
Tags