కేరళలో 'షిగెల్లా' కలకలం !

Telugu Lo Computer
0


కేరళలో మరోసారి షిగెల్లా కలకలం సృష్టించింది. కోజికోడ్‌ పుత్తియప్పలో ఏడేళ్ల బాలికలో ఈ వ్యాధిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల బాలికలో షిగెల్లా లక్షణాలు కనిపించాయని, మలంలో రక్తాన్ని గుర్తించిన తర్వాత పరీక్ష నిర్వహిస్తే పాజిటివ్‌గా తేలిందని పేర్కొన్నారు. బాలిక పొరుగింట్లో ఉన్న మరో చిన్నారిలోనూ ఈ వ్యాధి లక్షణాలున్నాయని, పిల్లలిద్దరికీ పెద్దగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. షిగెల్లా అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం ద్వారా ఈ వ్యాధి వస్తుందని, ఇది ఒకరినుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. లక్షణాలు తీవ్రమైతే మరణం సంభవిస్తుందని, అందుకే తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. షిగెల్లా కేసు నమోదవడంతో అధికారులు స్పందించారు. నివారణ కోసం పరిసర ప్రాంతంలోని బావుల్లో క్లోరినేషన్‌ చేపట్టారు. జ్వరం, డయేరియా లక్షణాలున్న వారిపై వైద్యారోగ్యశాఖ సర్వే సైతం నిర్వహించింది. ఇంతకు ముందు 2020లో కోజికోడ్‌లో షిగెల్లా కేసు నమోదైంది. ఆ సమయంలో తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలతో బాధపడుతూ ఓ ఏడాదిన్నర బాలుడు బాలుడు ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా.. షిగెల్లా సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. షిగెల్లా బ్యాక్టీరియా షిగెలోసిస్ అనే పేగు వ్యాధికి కారణమవుతుదని, అతిసారంతో పాటు, కడుపు నొప్పి, తిమ్మిరి, జ్వరం, వికారం, వాంతులు షిగెల్లా సాధారణ లక్షణాలని, కలుషితమైన ఆహారం తినడం వల్ల బ్యాక్టీరియా సోకడంతో వ్యాధి వస్తుందని వైద్యాధికారులు వివరించారు. తరచూ సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలనీ, మంచి ఆహారం సేవించాలని వైద్యులు సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయొద్దని, వ్యాధి లక్షణాలు ఉన్నవారు వంటలు చేయకూడదని, వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఓఆర్​ఎస్, ఉప్పు ద్రావణం, కొబ్బరి నీరు తీసుకోవాలని వైద్యులు సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)