పాకిస్తాన్తో జరిగిన టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఆతిథ్య జట్టును 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఆరోన్ ఫించ్ అద్భుత అర్థ శతకంతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయం అందించాడు. కాగా మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టీ20 ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. టెస్టు సిరీస్ను ఆస్ట్రేలియా సొంతం చేసుకోగా.. వన్డే సిరీస్ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. ఇక మంగళవారం జరిగిన ఏకైక టీ20 మ్యాచ్లో ఆసీస్ గెలుపొందింది. లాహోర్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఓపెనర్లు రిజ్వాన్(23), బాబర్ ఆజం(66) అదిరిపోయే ఆరంభం అందించారు. అయితే, మిగతా బ్యాటర్లలో ఖుష్దిల్(24) మినహా మిగతా వాళ్లెవరూ 20 పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. ఆసీస్ బౌలర్ నాథన్ ఎలిస్ 4 ఓవర్లలో కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్కు ట్రవిస్ హెడ్(26), కెప్టెన్ ఆరోన్ ఫించ్(55) గట్టి పునాది వేశారు. వన్డౌన్లో వచ్చిన జోష్ ఇంగ్లిస్(24), మార్కస్ స్టొయినిస్(23) తమ వంతు పాత్ర పోషించారు. ఇక వరుస విరామాల్లో వికెట్లు పడటంతో మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు కొనసాగింది. ఈ క్రమంలో బెన్ మెక్డెర్మాట్(19 బంతుల్లో 22 పరుగులు నాటౌట్) పట్టుదలగా నిలబడటంతో 19.1 ఓవర్లలో ఆసీస్ లక్ష్యాన్ని ఛేదించింది. హాఫ్ సెంచరీతో రాణించిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఉత్కంఠ పోరులో పాకిస్తాన్పై ఆసీస్ విజయం
April 06, 2022
0