ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తుండటంతో యూరోప్ దేశాలతోపాటు చైనా నుంచి కూడా రష్యాకు దిగుమతులు చాలావరకు తగ్గిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో పుతిన్ ప్రభుత్వం భారత్ ను మరిన్ని వైద్య పరికరాలు అందించాలని కోరింది. ఈ అంశంపై ఇరు దేశాలు చర్చలు జరపనున్నాయి. ఇరు దేశాలకు చెందిన మెడికల్ ఎక్విప్మెంట్ కంపెనీలు ఈ నెల 22వ తేదీన వర్చువల్గా సమావేశం కానున్నాయి. వైద్య సామగ్రి సరఫరాలను పెంచే మార్గాలపై చర్చించనున్నట్లు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీ ఫోరమ్ కోఆర్డినేటర్ రాజీవ్ నాథ్ తెలిపారు. ఈ విషయాన్ని రష్యా వాణిజ్య వర్గసంఘం ధ్రువీకరించింది. రష్యాపై పాశ్చాత్య దేశాల కఠిన ఆంక్షలు కొనసాగుతున్న వేళ.. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో కొనసాగిన తరహాలో ద్వైపాక్షిక వాణిజ్యం కోసం ఇరు దేశాలు స్థానిక కరెన్సీల్లో (రూపాయి-రూబుల్) చెల్లింపులపై కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో రష్యాకు ఎగుమతుల్ని పెంచే విషయంపై భారత్ సమాలోచనలు జరుపుతోంది. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్పై యుద్ధం కారణంగా రష్యాను ఏకాకిని చేయాలని అమెరికా దాని మిత్రపక్షాలు భావిస్తున్నాయి.
వైద్య పరికరాలు అందించండి !
April 20, 2022
0
Tags