నైరుతి రైల్వేజోన్ పరిధిలో కెపాసిటి, సేఫ్టీని పెంచుకునే దిశలో అనేక కార్యక్రమాలు కొనసాగుతున్న కారణంగా రానున్న వారం రోజులపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ విషయాన్ని నైరుతి రైల్వే ప్రయాణికుల సదుపాయాల విభాగం కమర్షియల్ మేనేజర్ డాక్టర్ అనూప్ దయానంద్ సాధు బుధవారం మీడియాకు తెలిపారు. యలహంక - హిందూపురం - పెనుకొండ, హొసదుర్గ - చిక్కజాజూరు, అల్నావర - అంబేవాడి, యళవిగి - సవనూరు, గదగ్ - హొలె ఆలూరు తదితర మార్గాలలో విద్యుద్దీకరణ పనులు, జంటరైలు మార్గాల పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. ఈ కారణంగా పది రైళ్లను రద్దు చేయడంతోపాటు మరో 14 రైళ్లను మళ్లించామన్నారు. ఈ అంశాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు. ఇప్పటికే టికెట్లు రిజర్వు చేసుకున్నవారికి మొత్తాలను వాపసు చేస్తున్నామన్నారు. ఈనెల 29 వరకు బెంగళూరు - కంటోన్మెంట్ మెము రైలుతోపాటు డైలీ ప్యాసింజర్ రైలు, ప్రశాంతి ఎక్స్ప్రెస్, కాచిగూడ ఎక్స్ప్రెస్ తదితర రైళ్లను రద్దు చేశామన్నారు. కాగా ఉద్యాన్ ఎక్స్ప్రెస్ బెంగళూరు సెంట్రల్ స్టేషన్ నుంచే ప్రయాణిస్తుందన్నారు. అనేక రైళ్ల మార్గాలను మళ్లించామన్నారు. ఈ సమాచారాన్ని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రకటన బోర్డులపై అందుబాటులో ఉంచామన్నారు. ఏఏ రైళ్లు రద్దు అయినది, ఏఏ రైళ్లు దారి మళ్లేవి తెలుసుకునేందుకు రైల్వే కంట్రోల్ రూంకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునన్నారు.
నైరుతి రైల్వేజోన్ లో వారంపాటు రైళ్ల రాకపోకలలో అంతరాయం
March 24, 2022
0
Tags