తెలంగాణలో కోటిస్తే బడికి మీ పేరే!

Telugu Lo Computer
0


ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'మన ఊరు- మన బడి'కార్యక్రమంలో విదేశాల్లో స్థిరపడిన తెలంగాణవాసులు భాగస్వా ములు కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారక రామారావు పిలుపు నిచ్చారు. కోటి రూపాయలకు పైగా విరాళం ఇస్తే.. వారు సూచించిన పేర్లను ప్రభుత్వ పాఠశాలలకు పెడతామని ప్రకటించారు. రాష్ట్ర విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలసి  తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలతో కేటీఆర్‌ వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఏర్పాటుపై నెలకొన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ అన్ని రంగాల్లో పురోగతి సాధించి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా రూపాంతరం చెందిందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విద్య, వైద్య రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులతో రాష్ట్రం పురోగతి సాధిస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యా రంగంలో సమూల మార్పులు తెస్తూ ప్రాథమిక విద్య మొదలుకుని మహిళా డిగ్రీ కాలేజీల ఏర్పాటు వరకు వందలాది విద్యా సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వెల్లడించారు. గురుకుల విద్యాసంస్థల విద్యార్థులు సాధిస్తున్న విజయాలను కేటీఆర్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 'మన ఊరు- మన బడి' ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో రూ.7,289 కోట్లతో సుమారు 26 వేల స్కూళ్లను అభివృద్ధి చేయనుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేసే ఉద్దేశంతో విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ ప్రవాసుల సాయాన్ని కూడా కోరుతున్నామన్నారు. ప్రభుత్వం నిర్దేశిం చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రూ.కోటి లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని విరాళంగా ఎవరు ఇచ్చినా వారు సూచించిన పేరును పాఠశాలకు పెడతా మన్నారు. రూ.10 లక్షలు లేదా అంతకు మించి ఆర్థిక సాయం చేసే వారు సూచిం చిన పేర్లు తరగతి గదులకు పెడతామ న్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తోచినంత సాయం చేసేందుకు ముందుకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు. రాష్ట్ర ఆవిర్భావంతో విద్యారంగంలో అనేక సానుకూల మార్పులు వచ్చాయని, మన ఊరు- మన బడితో ప్రభుత్వ పాఠశాలలు సంపూర్ణంగా రూపాంతరం చెందుతాయని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చే ఎన్నారైలకు విద్యా శాఖ తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం కో-ఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల, టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధి అనిల్‌ కూర్మాచలం, విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ దేవసేన తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)