నేరెళ్ల వేణుమాధవ్

Telugu Lo Computer
0


తెలంగాణలోని వరంగల్ పట్టణం లోని మట్టెవాడలో శ్రీహరి, శ్రీలక్ష్మి దంపతులకు 1932 డిసెంబరు 28న జన్మించారు. తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త. ఆరు భాషల్లో పండితుడు. వేణుమాధవ్ ఈయనకు పన్నెండో సంతానం. సాహిత్యంలో మంచి అభినివేశం ఉండడం వల్ల, ఆ కాలంలో వరంగల్ పట్టణానికి వచ్చే ప్రముఖులందరికీ వారి ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చేవారు. అలా వీరింట్లో బస చేసిన వారిలో చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, వావిలికొలను సుబ్బారావు, వడ్డాది సుబ్బారాయుడు, రాయప్రోలు సుబ్బారావు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, కాశీ కృష్ణాచార్యులు, యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి వంటి ఉద్ధండులున్నారు. వీరితో జరిగిన సాహితీ గోష్ఠుల ప్రభావం వేణుమాధవ్ మీద పడింది. తన 8 వ ఏట లక్ష్మయ్య పంతులు గారి వద్ద అక్షరాభ్యాసం చేసి, రాఘవయ్య మాష్టారు గారి వద్ద కొంతకాలం ప్రైవేటుగా చదివి గవర్నమెంట్ స్కూల్లో 3వ తరగతిలో చేరి బోల్తా ఉభాయిదా (పెద్ద బాలశిక్ష) చదవడం ప్రారంభించారు. సినిమాలంటే ఎంతో ఇష్టం. ఆ కాలంలో వచ్చిన చిత్తూరు నాగయ్య గారి గృహలక్ష్మి, వందేమాతరం, దేవత, స్వర్గసీమ, పోతన, వేమన సినిమాలు చూసి నాగయ్య గారిమీద అభిమానం పెంచుకున్నారు. నాగయ్య కూడా ధ్వన్యనుకరణ చేయగలవారు కావడంతో ఆయన అభిమానంతో కేవలం స్వయం పరిశీలనతోనే ఆ రంగంలో ప్రవేశించాడు. ఇవేకాకుండా వేమూరి గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య గారలు నటించిన సినిమాలు చూసి, ఇంటికి రాగానే ఆ సినిమాల్లోని పాటలను, పద్యాలను యథాతథంగా అనుకరించి చూపేవారు. అలా మొదలయ్యింది వారి మిమిక్రీ ప్రస్థానం. ఆంధ్ర విద్యాభివర్ధిని (ఏవీవీ) హైస్కూల్లో చదువుతున్నప్పుడు హరి రాధాకృష్ణ మూర్తి గారి శిష్యరికంలో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి ప్రహసనాల్లో నటించడం ద్వారా తన రంగస్థల జీవితానికి శ్రీకారం చుట్టారు. కొన్ని పురస్కారాలు కూడా లభించాయి. హాస్యనాటకాలంటే ముందుండే వాడు. మిగతా గురువులు కందాళై శేషాచార్యులు గారు, యద్దనపూడి కోదండ రామ శాస్త్రి గారు వీరి అభివృద్ధికి తోడ్పడ్డారు. 1950 లో మెట్రిక్యులేషన్, 1952 లో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీలో చేరారు. నాటి ప్రిన్సిపాల్ బారు వెంకట రామనర్సు గారు మిగతా లెక్చరర్లు వారించినా వినకుండా, గుడ్ కాండక్టు కింద వేణుమాధవ్ గారికి ఆ రోజుల్లో అరవై రూపాయల స్కాలర్ షిప్ ( బర్సరీ ) మంజూరు చేశారు. దానితో వీరు ముప్పయి ఇంగ్లీషు సినిమాల్ని తనివిదీరా చూసి వాటిల్లోని ఆర్టిస్టుల గొంతులు, ముఖ్యమైన సన్నివేషాలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నోట్స్ తో సహా వినిపిస్తే, రామనర్సు గారు పరమానందభరితులై "యూ విల్ బికం ఎ గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ ద వరల్డ్" అని, ఇకనుండి నీకే అవసరం వచ్చినా నువ్వెవరినీ అడగకు. నా పెద్ద కుమారుడు విఠల్ ( బీ. పీ. ఆర్. విఠల్ గారు అనంతరకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు) అయితే నీవు నా రెండవ కుమారుడవు అని మనసారా ఆశీర్వదించారు. ఆ దీవెనలే వీరిని 'విశ్వ విఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్' గా ఎదిగేలా చేసాయి. 1953 లో ప్రభుత్వ పాఠశాల (జి సి ఎస్ స్కూలు హనుమకొండ) లో ఉపాధ్యాయుడుగా ప్రవేశించి, ధర్మ సాగరం, హనుమకొండలోని ప్రాక్టీసింగ్ స్కూలు, మట్వాడ ఉన్నత పాఠశాల, జనగామ, శంభునిపేట పాఠశాలల్లో పనిచేశారు. అనంతరకాలంలో ప్రైవేటుగా బీ.ఏ. బీ. కాం పాసయ్యారు. తొలి ప్రదర్శన 1947 లో ఇచ్చారు. చెప్పుకోదగిన మలి ప్రదర్శన 1953 లో రాజమండ్రిలో జరిగిన థియేటర్స్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్ లో బలరాజ సహానీ గారి అధ్యక్షతన, గరికపాటి రాజారావు, దాడి గోవిందరాజులు,స్థానం నరసింహారావు, చాగంటి సన్యాసిరాజు గారల సమక్షంలో ఇచ్చారు. తెనాలి పట్టణంలోని అభ్యుదయ భావాలున్న స్వాతంత్ర్య సమరయోధులు కొల్లా కాశీవిశ్వనాధం, తయారమ్మ దంపతుల కుమార్తె శోభావతి గారితో వీరి వివాహం 3-2-1957 న జరిగింది. దీనికి సంధాన కర్తగా వ్యవహరించిన వారు స్థానం నరసిం హారావు గారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు శ్రీనాథ్, రాధాకృష్ణ. ఇద్దరు అమ్మాయిలు లక్ష్మీతులసి, వాసంతి వేణుమాధవ్ సినిమా, సాహిత్యం, కళలు లాంటి పలురంగాల ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. ఈయన ప్రదర్శనలు పలువురు రాజకీయ ప్రముఖుల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు లాంటి ఎంతోమంది ఉన్నారు. వీరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1977 లో "కళాప్రపూర్ణ ", జె.ఎన్.టి.యూ.సీ, 1987 లో,కాకతీయ విశ్వవిద్యాలయం 1992 లో గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. వీరికి తిరుపతి పట్టణంలో గజారోహణం, పొరసన్మానం జరిగాయి. వీరి బిరుదులు - ధ్వన్యనుకరణ సామ్రాట్, మిమిక్రీ సామ్రాట్, చుపే రుస్తుం ధ్వన్యనుకరణ చక్రవర్తి, కళాసరస్వతి, స్వర్ కే రాజా, ధ్వన్యనుకరణ ప్రవీణ, ధ్వన్యనుకరణ కళానిధి, మిమిక్రీ రత్న, విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సార్వభౌమ,మున్నగునవి. వీరు 'నేరెళ్ళ వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్' ను స్థాపించి ప్రతియేటా తన పుట్టినరోజైన డిసెంబర్ 28న ప్రముఖ కళాకారులను పదివేల రూపాయల పురస్కారంతో సత్కరిస్తున్నారు. ఈ పురస్కారం పొందిన వారు - డా. కాశీభట్ల విశ్వనాథం (చిత్రలేఖనం 0 2002, ఎస్.కె.గౌడ్ (నాటకం) 2003, కవిశాబ్దిక కేసరి నల్లాన్ చక్రవర్తుల రఘునాధాచార్య (వేద పండితులు) 2004, జమ్మలమడక కృష్ణమూర్తి (నాటకం) 2005, ఉల్లి రామచంద్రయ్య (హిందుస్తానీ సంగీతం) 2006, తిరుమలశెట్టి సీతాలత (నాటకం) 2007, జానీలీవర్ (మిమిక్రీ) 2008, కోవెల సుప్రసన్నాచార్య (సాహిత్యం) 2009, వి.హరికిషన్ (మిమిక్రీ) 2010, చుక్కా సత్తయ్య (ఒగ్గుకథ) 2011, వెలిదె హరిశంకర శాస్త్రి (హరికథ) & తణుకు రాజ్యం (నాటకం) 2012. వీరి పేరిట హనుమకొండ పట్టణంలో నిర్మింపబడ్డ 'డా.నేరెళ్ళ వేణుమాధవ్ గారి కళాప్రాంగణం ' సాహిత్య,సాంస్కృతిక కార్యక్రమాలకు చక్కని వేదికగా ఉపయోగపడుతున్నది. తన ప్రదర్శనలతో క్రమంగా ప్రసిద్ధుడయ్యాడు. ముఖ్యంగా ప్రసిద్ధులైన వ్యక్తులను, నాయకులను అనుకరించడంలో ఇతనికి పెట్టినది పేరు. ధ్వన్యనుకరణకు ఇతని వలన తెలుగునాట విశిష్టమైన ప్రాచుర్యం లభించింది. 2001లో ఇతనికి పద్మశ్రీ పురస్కారం లభించింది. 1981లో శ్రీ రాజాలక్ష్మీ ఫౌండేషన్ బహుమతి లభించింది. ఇతని శిష్యులలో ప్రసిద్ధుడైన మరొక మిమిక్రీ కళాకారుడు హరికిషన్. పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్‌ 2018, జూన్ 19వ తేదీ మంగళవారంనాడు తమ 85వ యేట కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్‌లోని స్వగృహంలో ఉదయం తుదిశ్వాస విడిచారు.

Post a Comment

0Comments

Post a Comment (0)