ఫేస్‌ రికగ్నైషన్‌ తొలగింపు

Telugu Lo Computer
0

 


ఫేస్‌బుక్‌లో ఫేషియల్‌ రికగ్నైషన్‌ను తొలగించడానికి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఫేస్‌ప్రింటర్లను సైతం తొలగించనున్నట్లు ఫేస్‌బుక్‌ కంపెనీ మాతృసంస్థ 'మెటా' తెలిపింది. ఫేషియల్‌ రికగ్నైషన్‌ టెక్నాలజీలో ఇదోక భారీ మార్పు అని ఫేస్‌బుక్‌ మాతృసంస్థ 'మెటా' ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జెరోమ్‌ పెసెంటి తెలిపారు. ''విస్తృత వినియోగం నుంచి పరిమిత వినియోగానికి కుదించడానికి ఫేస్‌బుక్‌లో ఫేస్‌ రికగ్నైషన్‌ సాంకేతికతను మేము తొలగించనున్నాం. ఫేస్‌బుక్‌లో దీన్ని ఉపయోగిస్తున్నవారు ఇక భవిష్యత్‌లో ఈ సాంకేతికతను ఉపయోగించలేరు. ముఖ గుర్తింపు కోసం ఉపయోగించే టెంప్లేట్‌లను తొలగించనున్నాం'' అని తన బ్లాగ్‌లో ఆయన పేర్కొన్నారు. పెరుగుతున్న సామాజిక ఆందోళనలకు వ్యతిరేకంగా బ్యాలెన్స్‌ చేసేందుకు ఈ సానుకూల నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఫేస్‌ రికగ్నైషన్‌ సాంకేతికతను ఫేస్‌బుక్‌ 2010లో తీసుకొచ్చింది. ఫేస్‌బుక్‌ వాడుతున్న యూజర్లలో మూడొంతుల మంది ఫేషియల్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ సాంకేతికతను తొలగించడం వల్ల ఒక బిలియన్‌ కంటే ఎక్కువ మంది ప్రభావితం కానున్నారు. ముఖ్యంగా దృష్టిలోపం ఉన్నవారికి ఉపయోగపడే ఆటోమెటిక్‌ ఆల్ట్‌ టెక్ట్స్‌ (ఏఏటీ)పై దీని ప్రభావం పడనుంది. యూజర్ల ఖాతాల్లోని వ్యక్తిగత ముఖ గుర్తింపు టెంప్లేట్‌లు తొలిగిపోనున్నాయి. ఫోటోలు, వీడియోల్లోని ముఖాలను ఫేస్‌బుక్‌ దానంతట అది గుర్తించదు. ఫొటోల్లోని వ్యక్తి సూచించడానికి, వారి పేరుతో ట్యాగ్‌ చేయడానికి ఇక కుదరదు. ఇక ఫొటోల్లోని వ్యక్తులను ఇతరులు గుర్తించకుండా సాధ్యపడుతుంది. వ్యక్తిగత గోప్యతకు సంబంధించి ఫేస్‌బుక్‌లో ఫేస్‌ రికగ్నైషన్‌ సాంకేతికతతో ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే దీనికి సంబంధించి నియంత్రణ సంస్థలు దీని వినియోగాన్ని నియంత్రించే నిబంధనలు రూపొందించే ప్రక్రియలో ఉన్నట్లు 'మెటా' తెలిపింది. అయితే ఈ మార్పులు ఈ నెలలోనే అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత కొన్నిరోజులుగా ఫేస్‌బుక్‌ వ్యక్తిగత గోప్యతపై తరచూ విమర్శలపాలవుతోంది. పలుదేశాల్లో న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కుంది. ఇటీవల కంపెనీ మాజీ ఉద్యోగి ఫేస్‌బుక్‌ డాక్యుమెంట్లను లీక్‌చేయడంతో ఫేస్‌బుక్‌ మాతృసంస్థకు కష్టాలు ఎక్కువయ్యాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)