కరోనా విపత్తు నుంచి బయటపడ్డ దేశ ప్రజలకు కేంద్రం రోజుకో షాక్ ఇస్తోంది. నిత్యావసర ధరల పెంపు ఇంధనం, వంటగ్యాస్, నిత్యవసరాలకే పరిమితం అవుతుందనుకుంటే ఇప్పుడు కరెంట్ ఛార్జీలపై కేంద్రం కన్నుపడిండి. విద్యుదుత్పత్తికి వినియోగించే బొగ్గు, గ్యాస్ ధరలు పెరగడం వల్ల పడుతున్న భారాన్ని ఎప్పటికప్పుడు వినియోగదారుల నుంచే వసూలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఇంధన సర్దుబాటు ఛార్జీల రూపంలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మార్పులు చేస్తున్నట్లుగా ఇకపై కరెంట్ బిల్లు కూడా ప్రతిసారి మార్చాలని నిర్ణయించింది. అదే నిర్ణయాన్ని అమలు చేయాలని రాష్ట్రాలు, ఈఆర్సీలను ఆదేశించింది. గత నెల 22న విద్యుత్ నిబంధనలు-2021ను ప్రకటించింది కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ. ధరలు పెంచే విషయంపై రాష్ట్రాల ఈఆర్సీలు సొంత ఫార్ములా రూపొందించే వరకు కేంద్ర ఫార్ములాను అనుసరించాలంటోంది. పెరిగే బొగ్గు, గ్యాస్ ధరల వ్యయ భారాన్ని విద్యుదుత్పత్తి కంపెనీలు సకాలంలో డిస్కంల నుంచి, డిస్కంలు వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవడానికి వీలు కల్పిస్తూ ఈ కొత్త రూల్ని పాస్ చేసింది కేంద్రం. ప్రస్తుతం విద్యుత్ ఛార్జీలను ఏడాదికి ఒకసారి సవరించుకునే పద్దతి ఉంది. కానీ ఇంధన సర్దుబాటు చార్జీల ఫార్ములా ఆధారంగా టారిఫ్ను ఏడాదిలో ఒకసారికి మించి సవరించుకోవడానికి విద్యుత్ చట్టంలోని సెక్షన్ 62(4) అనుమతిస్తోంది.
కరెంట్ ఛార్జీలపై రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
November 13, 2021
0