మతాంతర వివాహాలు చేసుకున్న వారు తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కోర్టు పేర్కొంది. ఇలాంటి జంటలు దాఖలు చేసిన 17 పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా జస్టిస్ సునీత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. " సింగిల్ ఫ్యామిలీ కోడ్ ద్వారా మతాంతర వివాహాలు చేసుకునేవారిని కాపాడాల్సిన సమయం వచ్చింది. పౌర్లమెంటు ఇందుకు తగిన నిర్ణయం తీసుకోవాలి. ఈ వివాహాలపై చర్చించి వీటన్నింటిని ఒకే చెట్టు కిందకు తీసుకురావాలి. సింగిల్ ఫ్యామిలీ కోడ్ అమలయ్యేలా చూడాలి. " -జస్టిస్ సునీత్ కుమార్
రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన స్టాండింగ్ కౌన్సిల్ మాత్రం భిన్నంగా స్పందించింది. జిల్లా యంత్రాంగం దర్యాప్తు కాకుండా పిటిషనర్ల వివాహం రిజిస్టర్ కాదని స్టాండింగ్ కౌన్సిల్ వాదించింది. జిల్లా పాలన యంత్రాంగం నుంచి వారికి అనుమతి ఇంకా దక్కలేదని పేర్కొంది. వివాహం కోసం తమ భాగస్వామి మతాన్ని తీసుకునేటప్పుడు జిల్లా మెజిస్ట్రేట్ అనుమతి కావాలని తెలిపింది. అయితే పౌరులకు తమకు నచ్చిన భాగస్వామిని, మతాన్ని ఎంచుకనే హక్కు ఉందని స్టాండింగ్ కౌన్సిల్ ఒప్పుకుంది. వివాహం అనేది ఇద్దరు వ్యక్తులు కలుసుండేందుకు చట్టం గుర్తించే విషయం మాత్రమేనని ఇందుకోసం వివిధ వర్గాల చట్టాలు తిరగేయాల్సిన పనిలేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఇలా మతాంతర వివాహాలు చేసుకునేవారిని నేరస్థులుగా పేర్కొనడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని కోర్టు పేర్కొంది. వాదనలు విన్న అనంతరం కోర్టు.. పిటిషనర్ల వివాహాన్ని రిజిస్టర్ చేయాలని సంబంధిత మ్యారేజ్ రిజిస్టార్లను ఆదేశించింది. జిల్లా యంత్రాంగాల అనుమతి కోసం వేచిచూడాల్సిన అవసరం లేదని పేర్కొంది.