చెన్నైకి రెడ్‌ అలర్ట్‌

Telugu Lo Computer
0


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తాంధ్రకు చేరువగా కదులుతున్న నేపథ్యంలో చెన్నైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. చెన్నై సమీప జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని, చెన్నైలో 20 సెం.మీ. ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో రెడ్‌ అలర్ట్‌ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. గురువారం చెన్నై, తిరువళ్లూర్‌, కాంచీపురం, చెంగల్‌పట్టు, కడలూర్‌, విళ్లుపురం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. వేలూర్‌, మహాబలిపురం, తిరువణ్ణామలై, పుదుచ్చేరి, కడలూర్‌లోనూ భారీ వర్షాలు పడుతాయని పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌ ఎస్‌.బాలచంద్రన్‌ తెలిపారు. రాష్ట్రంలోని డెల్టా జిల్లాలైన తూత్తుకుడి, రామనాథపురం, విళ్లుపురం, మదురై, శివగంగై, సేలం, విరుదునగర్‌, పుదుక్కోట్టై, పెరంబలూర్‌, కళ్లకురిచ్చి, తేని, దిండుగల్‌, కరూర్‌, తిరుచ్చి, తెన్‌కాశి, అరియలూర్‌ జిల్లాల్లో బుధవారం, గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. చెన్నైలో గురువారం ఆకాశం మేఘావృతమై కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో రెండు రోజుల పాటు కనిష్ఠంగా 40 నుంచి 50 కి.మీ. వేగంతో గరిష్ఠంగా 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం బంగాళాఖాతంలో వాయుగుండంతో కూడిన అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నట్లు, గురువారం నాటికి దక్షిణ ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర తమిళనాడు తీరాలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో వర్షాలు పడే అవకాశముందన్నారు. అల్పపీడనం భూమికి దగ్గరగా వచ్చిన తర్వాత తీర ప్రాంతాలవైపు కదిలే అవకాశం ఉందని తెలిపారు. గత వారం కురిసిన వర్షాల నుంచి చెన్నై ఇంకా తేరుకోక మునుపే మళ్లీ గురువారం అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో కార్పొరేషన్‌ అధికారులు సన్నద్ధమయ్యారు. బుధవారం కూడా కార్పొరేషన్‌ సిబ్బంది వదర నీటిని తోడే చర్యలు చేపట్టారు. 848 మంది ప్రజలు పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)