టమోటా కిలో రూ 60

Telugu Lo Computer
0


టమోటా ధర సామన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో మార్కెటింగ్‌ శాఖ నేరుగా రైతుల నుంచి టమాటాలను కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా విక్రయాలు చేపట్టింది. అనంతపురం, చిత్తూరు మార్కెట్‌ యార్డుల్లో రైతుల నుంచి కిలో రూ.50-55 చొప్పున కొనుగోలు చేసి వైఎస్సార్‌ కడప, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రైతు బజార్ల ద్వారా రవాణా చార్జీలతో కలిపి ఒక్కొక్కరికి కిలో రూ.60 చొప్పున విక్రయిస్తోంది. గతంలో ఉల్లి ధరలు పెరిగిన విషయంలో వ్యవహరించిన విధంగానే ఇప్పుడు టమోటా అంశంలోనూ స్పందించాలని ప్రభుత్వం మార్కెటింగ్ శాఖను ఆదేశించింది. ముందుగా మూడు జిల్లాల్లో అందుబాటులోకి తెచ్చిన తరువాత, క్రమేణా ఇతర జిల్లాలకు ఇవే ధరలతో విక్రయించాలని నిర్ణయించింది. ఒక్కో వినియోగదారుడికి కిలో చొప్పున అందిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు ఏడు నుంచి 10 టన్నుల చొప్పున కొనుగోలు చేస్తుండగా రానున్న రోజుల్లో కనీసం వంద టన్నులు రైతుల నుంచి సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 61,571 హెక్టార్లలో టమాటా సాగవుతుండగా చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనే 56,633 హెక్టార్లలో పండిస్తున్నారు. ఏటా మొత్తం 22.16 లక్షల టన్నుల దిగుబడుల్లో 20.36 లక్షల టన్నులు మూడు జిల్లాల నుంచే వస్తున్నాయి. ఒక్క సారిగా టమోటా ధర పెరగటానికి భారీ వర్షాలు కారణంగా చెబుతున్నారు. వరదలతో టమాటా పంటకు అపార నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనా ప్రకారం రాయలసీమ జిల్లాల్లోనే 2 వేల హెక్టార్లలో 65 వేల టన్నుల వరకు దెబ్బ తిన్నట్టు అంచనా. దీంతో తీవ్ర కొరత ఏర్పడి టమాటా ధరలు నింగినంటాయి. ఈ పరిస్థితిని గుర్తించి అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి టమాటా కొనుగోలు చేసి వినియోగదారులకు అందించాలని నిర్ణయించింది. సకాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల మరో వారం రోజుల్లో టమాటా ధర కిలో రూ.30-40కి దిగి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి టమాటా దిగుమతితో మదనపల్లె వ్యవసాయ కమిటీ మార్కెట్‌లో ధరలు తగ్గాయి. రెండు రోజుల క్రితం గ్రేడ్‌ -1 రకం కిలో రూ.130 పలకగా గురువారం రూ.52కి దిగి వచ్చాయి. చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ నుంచి పది లారీల టమాటాలు వచ్చాయి. రెండో రకం టమాటా కిలో రూ.10-30 మధ్య ధరలు నమోదయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)