26 వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రాంభమైయ్యాయి. సమావేశాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత ఒక రోజు మాత్రమే సమావేశాలు నిర్వహించాలని భావించినా ఆ తరువాత  నవంబర్ 26 వరకు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ జనగణన తీర్మానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా బీసీ జన గణన చేపట్టాలని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న బీసీ కులాల వారీగా జనభాను లెక్కించాల్సిన ప్రాధాన్యత, రిజర్వేషన్లు, తదితర అంశాలను తీర్మానంలో పొందుపర్చనున్నారు. ఈ సమావేశాల్లో ఏపీ సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. అలాగే మహిళా సాధికారతపైనా అసెంబ్లీలో చర్చ జరగనుంది. వీటితో పాటు పలు కీలకమైన బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. అలాగే సంక్షేమ పథకాలు, ఇతర అంశాలపై సభలో చర్చ జరగనుంది. బీఏసీ సమావేశ వివరాలను చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల విషయంలో ప్రతిపక్షం చెప్పినట్లే చేస్తున్నామని ఆయన అన్నారు. గతంలో బీఎసిలో ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వని పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు మాత్రం ప్రతిపక్షం మాటే విన్నామని తెలిపారు. కరోనా వల్ల ఒక్కరోజు మాత్రమే నిర్వహించాలని భావించామన్నారు. ఎమ్మెల్సీల నామినేషన్ ల తర్వాత సభను నిర్వహించాలనుకున్నా మన్నారు. కానీ బీఏసీలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు సమావేశాలు నిర్వహించాలని కోరారని, తక్షణమే సమావేశాలు పొడిగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ నెల 26 తేదీ వరకు వివిధ అంశాలపై చర్చించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే ప్రతిపక్ష టీడీపీ 27 అంశాలపై చర్చించాలని కోరిందని వెల్లడించారు. ఈ సమావేశాల్లో మహిళా సాధికారతతో పాటు బీసీల జనగణన కు సంబంధించిన తీర్మానంపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ఏ అంశంపై అయినా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. తొలిరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఇటీవల మృతి చెందిన మాజీ ప్రజాప్రతినిధులకు సంతాపం తెలిపారు. అంతకుముందు ఇటీవల బద్వేలు ఉపఎన్నికలో గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ సుధ చేత స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రమాణ స్వీకారం చేయించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)