ఇంధనం లేక ఇక్కట్లు!
October 20, 2021
0
నాలుగురోజులుగా కురిసిన వర్షాలకు ఉత్తరాఖండ్ రాష్ట్రం అతలాకుతలమైంది. వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగిపడటంతో రాణిఖేత్, ఆల్మోరాకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఆ ప్రాంతాలు వరుసగా రెండోరోజు ఇంధన కొరతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. డెహ్రాడూన్ కు 320 కిలోమీటర్లు దూరంలో ఉన్న రాణిఖేత్ వద్ద చాలా తక్కువ మొత్తంలో ఇంధనం అందుబాటులో ఉంది. దాన్ని అత్యవసర సేవల కోసం అందుబాటులో ఉంచారు. 24 గంటల తర్వాత అక్కడ లోవోల్టేజ్ ఎలక్ట్రిసిటీని పునరుద్ధరించారు. టెలిఫోన్, ఇంటర్నెట్ సేవల అంతరాయం కొనసాగుతోంది. అల్మోరా పరిస్థితి దాదాపుగా ఇలాగే ఉంది. కొండచరియలు పడి, రహదారులు మూసుకుపోవడంతో ఈ రెండు ప్రాంతాలకు నైనిటాల్ తో సంబంధాలు తెగిపోయాయి. ఈ భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 47 మంది మృతి చెందారని, ఒక్క కుమాఓన్ ప్రాంతంలోనే 42 మంది ప్రాణాలు కోల్పోయారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.