క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు బెయిల్ మంజూరైంది. బాంబే హైకోర్టు గురువారం ఆర్యన్తో పాటు అర్బాజ్ మర్చంట్, మూన్మూన్ ధమేచాలకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో దాదాపు మూడు వారాలుగా జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమమైంది. బెయిల్ పిటిషన్పై బాంబే హైకోర్టులో మూడు రోజుల నుంచి సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఆర్యన్ ఖాన్ తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ వాదనల సందర్భంగా ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కుట్రపూరితంగానే ఆర్యన్ను ఎన్సీబీ అధికారులు ఈ కేసులో ఇరికించారన్నారు. ఆర్యన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదని.. డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా వైద్య పరీక్షల ఆధారాలేవీ లేవని కోర్టుకు పదేపదే తెలిపారు. తనతో పాటు కలిసి వచ్చిన ఓ వ్యక్తి వద్ద డ్రగ్స్ దొరికితే ఆర్యన్ను ఎలా అరెస్టు చేస్తారు? 20 రోజులకు పైగా ఎలా జైలులో ఉంచుతారు? అని ఎన్సీబీని ప్రశ్నించారు. అతడి వయస్సును దృష్టిలో ఉంచుకొని ఆర్యన్కు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఎన్సీబీ తరఫున గురువారం ఏఎస్జీ అనిల్ సింగ్ వాదనలు వినిపించారు. ఆర్యన్ డ్రగ్స్ వాడటం తొలిసారేమీ కాదని వాదించారు. డ్రగ్స్ విక్రేతలను చాలా సార్లు సంప్రదించాడనీ.. డ్రగ్స్ విక్రయించే ప్రయత్నంలోనూ ఉన్నట్టు వాట్సాప్ చాట్లలో తేలిందన్నారు. వాదోపవాదాలు విన్న బాంబే హైకోర్టు ఆర్యన్తో పాటు అర్బాజ్, మూన్మూన్లను జైలులో ఉంచేందుకు సరైన ఆధారాల్లేవని పేర్కొంటూ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో పూర్తిస్థాయి కోర్టు ఆర్డర్ రేపు వెలువడే అవకాశం ఉంది. ఆర్యన్ఖాన్, అర్బాజ్ మర్చంట్, మూన్మూన్ ధమేచాలో జైలు నుంచి రేపు లేదా ఎల్లుండి విడుదలై బయటకు వచ్చే అవకాశం ఉందని ముకుల్ రోహత్గీ మీడియాకు తెలిపారు.
ఆర్యన్ ఖాన్కు బెయిల్ మంజూరు
October 28, 2021
0
Tags