ప్రముఖ సినీ నటుడు రాజబాబు(64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రాజబాబు ఆకస్మిక మరణంతో చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపురపేటలో 1957 జూన్ 13న రాజబాబు జన్మించారు. బాల్యం నుంచి ఆయన నటనపై ఎంతో ఆసక్తిగా కనబరిచేవారు. దీంతో చిన్నతనంలోనే నాటకాలు వేస్తూ దేశమంతా తిరిగారు. ఈ క్రమంలో 1995లో వచ్చిన ‘ఊరికి మొనగాడు’ చిత్రంతో రాజబాబు నటుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. సుమారు 62 చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. సినిమాల్లోనే కాకుండా పలు ధారావాహికల్లోనూ ఆయన నటించారు. బుల్లితెర ప్రేక్షకుల్ని సైతం ఆయన అలరించారు. 2005లో ‘అమ్మ’ సీరియల్లోని పాత్రకుగానూ ఆయన్ని నంది అవార్డు వరించింది. తెర మీద గంభీరంగా కనిపించే రాజబాబు నిత్య జీవితంలో చాలా సరదామనిషి. ఆయన్ని అందరూ బాబాయ్ అని ఆప్యాయంగా పిలుస్తుంటారు.
సినీ నటుడు రాజబాబు కన్నుమూత
October 25, 2021
0
Tags