హైదరాబాద్ విమానాశ్రయానికి జరిమానా!

Telugu Lo Computer
0
హైదరాబాద్ లోని శంషాబాద్‌లో ఉన్న జిఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టును నిర్వహిస్తోన్న జిఎంఆర్‌ గ్రూప్‌నకు జరిమానా విధించారు. ప్రయాణికులకు అందించే సేవల్లో లోపాల కారణంగా ఈ జరిమానాను తెలంగాణ కన్య్సూమర్‌ డిస్‌ప్యూట్‌ రిడ్రెస్సల్‌ కమిషన్‌ విధించింది. సుబ్రతో బెనర్జీ అనే వ్యక్తి 2014 సెప్టెంబరు 10న బెంగళూరు వెళ్లేందుకు జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టుకి చేరుకున్నారు. విమానం ఎక్కేందుకు ఎస్కలేటర్‌పై వెళ్తుండగా హఠాత్తుగా అది ఆగిపోయింది. దాంతో సుబ్రతో బెనర్జీ కింద పడిపోగా ఎస్కలేటర్‌పై ఉన్న ఇతర వ్యక్తులు ఆయనపై పడ్డారు. దాంతో ఆయన గాయపడి చికిత్స పొందుతూ 75 రోజుల పాటు తన కార్యాలయానికి వెళ్లలేకపోయారు. దాంతో తనకు కలిగిన అసౌకర్యంపై ఆయన ఫిర్యాదు చేశారు. మా తప్పేం లేదు : ఎయిర్‌పోర్టు యాజమాన్యం అయితే సుబ్రతో బెనర్జి ఆరోపణలపై ఎయిర్‌పోర్టు యాజమాన్యం వాదిస్తూ... ఎస్కలేటర్‌పైకి ఒకేసారి ఎక్కువ మంది ఎక్కడంతో ఓవర్‌ లోడ్‌ అయ్యిందని, దీంతో ఎస్కలేటర్‌ నెమ్మదిగా ముందుకు వెళ్లి ఆగిందని తెలిపింది. ఎస్కలేటర్‌ ఎప్పుడూ ముందుకే వెళ్తుంది తప్ప వెనక్కి రాదని చెప్పింది. సుబ్రతో అజాగ్రత్తగా ఉండటం వల్లే పడిపోయాడని ఎయిర్‌పోర్టు యాజమాన్యం న్యాయస్థానంలో వాదించింది. పైగా గాయపడ్డ సుబ్రతో బెనర్జీని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించామని, గుడ్‌విల్‌గా రూ. 1.51 లక్షలు కూడా చెల్లించినట్టు తెలిపింది. ఎయిర్‌పోర్టు వాదనపై సుబ్రతో విబేధించారు. ఆస్పత్రిని నుంచి డిశ్చార్జి అయి వెళ్లిన తర్వాత తనకు తిరిగి అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయని, ఆపరేషన్‌ జరిగిందని వివరించారు. దీని వల్ల మానసిక ఒత్తిడికి లోనయ్యానంటూ తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత కమిషన్‌ ఎయిర్‌పోర్టు అథారిటీదే తప్పుగా తేల్చింది. బాధితుడికి రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలంటూ తీర్పు వెలువరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)