దేశంలో పండుగ సీజన్ సందర్భంగా స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సెమీ కండక్టర్ల కొరత వున్నా స్మార్ట్ ఫోన్ అమ్మకాలు తగ్గలేదు. తాజాగా మార్కెట్ రీసెర్చ్ కౌంటర్ పాయింట్ ప్రకారం..ఈ పండుగ సీజన్లో దేశంలో స్మార్ట్ఫోన్ అమ్మకాలు దాదాపు రూ. 56,858 కోట్ల చేరువలో ఉన్నట్లు తెలిపింది. పండుగ సీజన్లో స్మార్ట్ఫోన్ రిటైల్ సగటు అమ్మకపు ధర 14 శాతం వృద్ధితో దాదాపు రూ. 17,200కు చేరింది. మిడ్, ప్రీమియం విభాగాలలోని స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు కష్టమర్లు మొగ్గు చూపుతున్నారని తాజాగా విడుదలైన కౌంటర్ పాయింట్ తన రిపోర్ట్లో పేర్కొంది. ఈ సందర్భంగా కౌంటర్పాయింట్ సీనియర్ విశ్లేషకుడు ప్రచిర్ సింగ్ మాట్లాడుతూ..దసరా,దీపావళి ఫెస్టివల్ సీజన్లో వినియోగదారుల డిమాండ్ అధికంగా ఉందని, అందుకే భారత్లో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు భారీగా జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓవైపు ఆఫర్లు, ఈఎంఐ సదుపాయం ఉండడంతో రూ.14,974.98 ఎక్కువ ధర ఉన్న ఫోన్ అమ్మకాలు పెరగడానికి కారణమైందన్నారు. ఈ సేల్స్ ఇలాగే కొనసాగితే పండుగ సీజన్లో దాదాపు 7.6 బిలియన్ డాలర్ల విలువైన, లేదంటే అంతకంటే ఎక్కువ స్మార్ట్ఫోన్లు అమ్మకాలు జరుగుతాయనే అంచనా వేశారు. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ.. 2021 పండుగ సీజన్లో మార్కెట్ విలువలో 1శాతం పెరుగుతుందని అంచనా వేసినప్పటికీ ..యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ ప్రకారం సంవత్సరానికి 14 శాతం పెరిగిందని చెప్పారు. ఇక ఈ పండగ సీజన్లో వినియోగదారుల సెంటిమెంట్ సానుకూలంగా ఉందన్నారు. చాలా మంది వినియోగదారులు చేసిన సేవింగ్స్లో వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారని, ఈ ధోరణి పండుగ సీజన్లో కొత్త స్మార్ట్ఫోన్లకు అప్గ్రేడ్ అయ్యేందుకు వీలుపడిందని అన్నారు.