మళ్లీ చొరబడిన చైనా విమానాలు

Telugu Lo Computer
0



తైవాన్‌లోకి మళ్లీ చైనా వైమానిక దళం చొరబడింది. చైనాకు చెందిన 38 యుద్ధ విమానాలు తైవాన్ సరిహద్దులోకి ప్రవేశించినట్లు తైవాన్‌ ఆరోపించింది. ఒక్క నెలలోనే 60 సార్లు సరిహద్దులను దాటి చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) రికార్డు సాధించింది. అమెరికా, బ్రిటన్ సహా అనేక దేశాల హెచ్చరికల తర్వాత కూడా తైవాన్‌ను భయపెట్టడం చైనా ఆపడం లేదు. చైనా తమ దేశ జాతీయ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 1 న 38 ఫైటర్ జెట్లతో ప్రదర్శనలు నిర్వహించింది. ఈ జెట్‌లు తైవాన్ సరిహద్దులోకి ప్రవేశించాయి. తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, చైనా 18 జే-16 లు, 4 సుఖోయ్-30 విమానాలు, అణుబాంబులు జారవిడిచే సామర్థ్యం ఉన్న రెండు హెచ్‌-6 బాంబర్లతో ప్రదర్శన నిర్వహించి తైవాన్‌ను భయపెట్టేందుకు ప్రయత్నించింది. తైవాన్ కూడా దీటుగానే ప్రతిస్పందించింది. తమ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలను ప్రదర్శించింది. చైనీస్ జెట్‌ల ఫ్లైట్ రూట్ మ్యాప్‌ను కూడా తైవాన్‌ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దీని ప్రకారం, చైనీస్ జెట్‌ల మొదటి బృందం ప్రతాస్ ద్వీపం ప్రాంతం గుండా వెళ్ళగా.. రెండవ బృందం బాషి ఛానల్ మీదుగా వెళ్లింది. ఈ ఛానెల్ తైవాన్‌ను ఫిలిప్పీన్స్ నుంచి వేరు చేస్తుంది. చైనీస్ జెట్‌లను పర్యవేక్షించేందుకు తైవాన్ క్షిపణి వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసింది. తైవాన్ నైరుతిలో చైనా చొరబాట్ల గురించి తరచుగా ఆరోపణలు వస్తున్నాయి. గత ఏడాది కాలంగా చైనీస్ ఎయిర్ ఫోర్స్ చొరబాటుపై తైవాన్‌ ఫిర్యాదు చేస్తున్నది. అయితే, ఈ విషయంలో చైనా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. తైవాన్‌పై పూర్తి స్వయంప్రతిపత్తిని చైనా ప్రకటించింది. చైనా వాదనను తైవాన్ తిరస్కరిస్తున్నది. ఈ కారణంగా చైనా సార్వభౌమత్వాన్ని అంగీకరించడానికి తైవాన్‌పై చైనా సైనిక, రాజకీయ ఒత్తిడిని పెంచుతున్నది.

Post a Comment

0Comments

Post a Comment (0)