ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్వరలో యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు. జీ 20 శిఖరాగ్ర సదస్సు , ప్రపంచ నేతల కాప్-26 సదస్సులో పాల్గొనేందుకు అక్టోబర్-29 నుంచి నవంబర్-2 వరకు ఇటలీ, బ్రిటన్ దేశాలలో మోదీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీ, బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్ సహా వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక భేటీల్లో మోదీ పాల్గొననున్నట్లు భారత విదేశాంగశాఖ తెలిపింది. అక్టోబరు 30-31 తేదీల్లో ఇటలీ రాజధాని రోమ్ లో 16వ జీ-20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీ ఆహ్వానం మేరకు మోదీ ఈ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. జీ-20 సభ్య దేశాల ప్రభుత్వాధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. అయితే ఈ సమావేశం… ప్రధాని మోదీ పాల్గొనే ఎనిమిదవ జీ20 శిఖరాగ్ర సమావేశం. ఆ తర్వాత నవంబరు 1-2తేదీల్లో బ్రిటన్ లోని గ్లాస్గౌలో జరిగే కాప్-26 ప్రపంచ నేతల సదస్సులో పాల్గొనేందుకు మోదీ బ్రిటన్కు వెళ్లనున్నారు. బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్ ఆహ్వానం మేరకు మోదీ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అక్టోబరు 31 నుంచి నవంబరు 12 వరకు కాప్-26 సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగానే ప్రపంచ నేతల సదస్సు నవంబరు 1-2 తేదీల్లో జరగనుంది. 120పైగా దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సుకు ఇటలీ, బ్రిటన్ అధ్యక్షత వహించనున్నాయి.
యూరప్ పర్యటనకు మోదీ
October 24, 2021
0
Tags