ఒఢిశా రాష్ట్రం బొలంగిర్ జిల్లాకు చెందిన రాజేష్ రానా అనే వ్యక్తికి సోషల్ మీడియా ద్వారా ఓ యువతితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అనంతరం ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి సంప్రదాయంగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు పెళ్లి తరువాత గత ఆగస్టులో ఇటుక బట్టీలో పని చేయడానికి భార్యభర్తలిద్దరూ రాజస్థాన్ వెళ్లారు. అక్కడ కొన్ని రోజులు ఇద్దరు కలిసి పనులు చేసుకుంటూ జీవించారు. అయితే అయితే కొత్త పనిలో చేరిన కొన్నిరోజులకు రాజేష్ తన భార్యను బరన్ జిల్లాకు చెందిన 55 ఏళ్ల వ్యక్తికి రూ. 1,80,000లకు అమ్మాడు. భార్యను అమ్మగా వచ్చిన డబ్బుతో విపరీతంగా జల్సాలు చేశాడు. భార్య ఎవరితోనో పారిపోయిందని అమ్మాయి వాళ్ల తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. అయితే తమ కూతురు ఇలా చేయదని భావించిన యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బొలంగిర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒడిశా నుంచి వచ్చిన పోలీసు బృందం బరన్ గ్రామానికి చేరుకొని మహిళ గురించి ఆరా తీయాగా, యువతిని 55 ఏళ్ల వ్యక్తికి భర్త అమ్మేశాడన్న విషయం పోలీసులకు తెలిసింది. దీంతో భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.