రామాయణం ఎందుకు చదవాలి?

Telugu Lo Computer
0


ఎప్పుడో త్రేతాయుగం నాటి కథ. వందల పేజీల గ్రంథం. అదే సమయంలో ఏ వ్యక్తిత్వ వికాస పుస్తకమో చది వితే, ఎంతోకొంత స్ఫూర్తి కలుగుతుంది. ఏ నెట్ క్లోనో సినిమా చూస్తే చక్కని కాలక్షేపం లభిస్తుంది. ఏ ఆఫీసుపనో చేసుకుంటే బాసు ప్రశంసా అందుతుంది. కానీ, ఈ ప్రయోజనాలన్నీ తాత్కా లికం. రామాయణానికి నిన్ను పరిపూర్ణ వ్యక్తిగా మార్చే శక్తి ఉంది. ఆ స్ఫూర్తి పదాడంబర వికాస పుస్తకంలా పక్షానికో, పున్నానికో పరిమితం కాదు. జీవితాంతం వెన్నంటి నిలుస్తుంది. ఇక,చిన్నచిన్న కష్టాలకే ఆత్మహత్య ఆలోచనలు రావు. ఒకటి రెండు అపోహలతోనే బంధాలు బీటలువారవు. ఆస్తిపాస్తుల కోసం అన్నదమ్ములతో తగువు పెట్టుకోం. దశరథ పుత్రుడైన రాముడు ఎన్ని కష్టాలు అనుభవిం చాడూ? ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నాడు ?  రాజ్యాన్ని కోల్పోయాడు, తండ్రిని కోల్పోయాడు. భార్య దూరమైంది, ఓ దశలో సోదరుడూ ప్రాణాపాయంలో పడ్డాడు. అయినా, ధైర్యాన్ని వీడలేదు. ఓటమిని అంగీకరించలేదు. వానర సైన్యాన్ని కూడ గట్టుకున్నాడు. సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నాడు. మహా శక్తిమంతుడైన రావణుడితో యుద్ధం చేశాడు. గెలిచాడు. ప్రజల హృదయాల్లో నిలిచాడు. అదీ పోరాట పటిమ.  రాముడితో మనకు పోలికే మిటి? అనుకోవడానికి వీల్లేదు. రాముడు ఎక్కడా తాను దేవుడినని చెప్పుకోలేదు. అలా ప్రవర్తించనూ లేదు. దశరథ పుత్రుడినైన శ్రీరాముడిని అనే ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడు. మనిషిలోని సాధారణ ఉద్వేగాలన్నీ రాముడిలోనూ ఉన్నాయి. కాకపోతే రాముడు ధర్మాన్ని నమ్మాడు. ధర్మాన్నే ఆచరించాడు. విగ్రహవాన్ ధర్మః అనిపించుకున్నాడు.  అదే అతడిని పురుషోత్తముడిని చేసింది. రామాయణం అంటేనే రాముడు నడిచిన దారి. వాల్మీకం చదవకపోతే ఓ విలువలమార్గం  శాశ్వతంగా మూసుకుపోతుంది. రామాయణం నిజంగానే మ...హా కావ్యం! ఏడు భాగాలు, ఐదువందల అధ్యాయాలు, ఇరవైనాలు గువేల పద్యాల సమాహారం. ప్రతి అధ్యాయాన్నీ సర్గ అంటారు. ప్రతి పద్యాన్ని శ్లోకం అంటారు.  రామాయణం పేరుకు రామకథే  కానీ... నదులూ, పర్వతాలూ, అడువులూ, వివిధ దేశాలూ, అనేకానేక లోకాలూ కథాక్రమంలో ప్రస్తావనకు వచ్చాయి. భిన్న జాతుల మనుషుల్నీ, వృక్షాల్నీ, పశుపక్ష్యాదుల్ని పరిచయం చేశాడు వాల్మీకి. ఎంతోమంది రాజులు తారసపడతారు. వారి వంశాలూ తెలుస్తాయి. ఆ ప్రకారంగా రామాయణంలో చరిత్ర ఉంది,  భూగోళం ఉంది, జీవ-జంతుశాస్త్రాలు ఉన్నాయి. ఇక మంచిచెడుల విషయానికొస్తే ఇది అచ్చమైన విలువల వాచకం. యుద్ధ వ్యూహాలూ, రణ తంత్రాలూ ఉన్నాయి. వాటిని నేటి రాజకీయాలకు అన్వయించుకుని పొలిటికల్ సైన్స్ కో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తో అనుబంధంగా చేర్చుకోవచ్చు. విశ్వాన్ని కూడా వర్ణించారు కాబట్టి, అంతరిక్ష శాస్త్రంగానూ పరిగణించుకోవచ్చు.మొత్తంగా రామాయణం సమగ్ర విజ్ఞాన సర్వస్వం!

సకల శాస్త్రాల సారం వాల్మీకి మహర్షి రామాయణాన్ని శ్రీరామపట్టాభిషేకానికో, రావణ సంహారానికో పరిమితం చేయలేదు. సకల వేదాల సారాన్నీ, ఉపనిషత్తుల రహస్యాల్నీ ఒడుపుగా ఇమిడ్చాడు. వ్యక్తిధర్మం, రాజధర్మం, పుత్రధర్మం... అన్నింటికీ మించి మానవ ధర్మం - రామకథలో అంతర్లీనం.  సీతారామ కల్యాణం సమయంలో జనకుడు... రామయ్యకు సీతమ్మను అప్పగిస్తూ 'ఛాయేవానుగతా సదా...! ఇక నుంచీ ఈమె సహధర్మచారిణి, నీడలా నీ వెంట వస్తుంది - అని చెబుతాడు. అతను ఆమెకు నీడ. ఆమె అతనికి నీడ. ఇంతకుమించిన వివాహధర్మం ఏం ఉంటుంది? క్షణికమైన మోహాలూ, పైపై మెరుగులూ జీవితాల్ని ఎలా ఛిన్నాభిన్నం చేస్తాయో హృదయాలకు హత్తుకునేలా వివరించాడు వాల్మీకి. ఎంతో విజ్ఞురాలు అయినా కూడా బంగారు వన్నెలో మెరిసిపోతున్న లేడిని చూడగానే సీత మనసు వశం తప్పింది. చర్మణా హృతచేతనా !మహా పండితుడైన రావ ణుడు సైతం బంగారుబొమ్మలా ఉన్న సీత మ్మను చూసీచూడంగానే మనసు పారేసుకున్నాడు, మోహావేశానికి గురయ్యాడు.  కాత్వంకాంచ నవర్ణభా! నిభాయించుకోలేని ఓ చిన్న బలహీనతే సీతను రాముడికి దూరం చేసింది, రావణుడిని ధర్మానికి దూరం చేసింది. అని సరిపోలుస్తాడు వాల్మీకి. నేటికాలపు అమాయక సీతమ్మలకూ, దురహంకారులైన దశ కంఠులకూ పరోక్షంగా హెచ్చరిక చేశాడు వాల్మీకి. మనం తీయని మాటల్నే నమ్ముతాం. అవి అబద్దాలైనా సరే ఆనందంగా ఆస్వాదిస్తాం. మనకు అయిష్టమైన సత్యాల్ని ఆమోదించడానికి సాహసించం. రావణుడూ అంతే. కాబట్టే, మారీచుడు చెప్పిన మంచి దశకంఠుడి చెవి కెక్కలేదు. 'సులభ్యా పురుషా రాజన్ సతతం ప్రియవాదినః'రావణా తీయ తీయని మాటలు చెప్పేవాళ్లు ఎక్కడైనా ఉంటారు. నాలాగా కఠిన వాస్తవాలు వివరించి మరీ హెచ్చరించేవాళ్లు చాలా అరుదు. దయ చేసి సమస్య తీవ్రతను అర్థం చేసుకో ' అంటూ జరగబోయే తీవ్ర పరిణామాల్ని కళ్లకుకడతాడు. ఏ అహంకారీ వాటిని పట్టించుకోడు.  దీంతో, తమ పతనానికి తామే కారణం అవుతారు. రాముడి శరాఘాతానికి నేలకూలిన వాలి, చివరి మాటగా కొడుకు అంగదుడికి హితోపదేశం చేస్తాడిలా 'ఎవరి మీదా మితిమీరిన ప్రేమ చూపించ వద్దు. ఎవరినీ అతిగా ద్వేషించవద్దు'. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం ఈ రెండు కారణాలతోనే నూటికి ఎనభైశాతం హత్యలూ హత్యా ప్రయత్నాలూ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇంకో మంచి మాటా అన్నాడు కృతఘ్నే నాస్తి నిష్కృతిః' ఇతరులు చేసిన మంచిని మరచిపోవడం మహాపాపం, దానికి పరిహారమే లేదు. ఆన్లైన్ వేదికలూ డేటింగ్ యాప్స్ పొద్దున్నే నేస్తాలైపోయి, సాయంత్రానికి దుకాణం కట్టేసుకునే ఇంట్ ఫ్రెండ్ షిప్ కూ అన్వయించు కోదగిన సుభాషితమూ ఒకటుంది. సర్వథా సుకరం మిత్రం, దుష్కరం ప్రతిపాలనం  స్నేహం చేయడం సులభమే. దాన్ని నిలబెట్టుకోవడమే మహా కష్టం! ప్రమోషన్లు రాలేదనో, ఇంక్రిమెంట్లు పడలేదనో పని మానేసి మరీ బాధపడిపోయే కెరీర్ జీవులకు వాల్మీకి ఓ గెలుపు మార్గం చెప్పాడు. యజమాని మనసు ఎలా గెలుచుకోవాలో బోధించాడు. రాముడిని మించిన బాసూ, హనుమంతుడిని మించిన దాసూ ప్రపంచంలో ఎక్కడుంటారు? 'ప్రాజెక్ట్ లంక' విజయవంతం అయిన సందర్భంగా రాముడు ఆంజనేయుడిని బెస్ట్ ఎంప్లాయీగా గుర్తిస్తాడు. 'యజమాని అంచనాలకు మించి పనిచేసే వాడే ఉత్తమ సేవకుడు. సమర్థత ఉండి కూడా ఒళ్లు దాచుకునేవాడు అథమ స్థాయికి చెందినవాడు' అంటూ అప్రెయిజలో హెమోర్ విభాగానికి పని కొచ్చే కొలమానాన్ని అందించాడు ఆదికవి.మనం పంచ్ డైలాగులుగా చెప్పుకొని మురిసిపోయే సంభాషణల్ని తలదన్నే వాక్యాలు రామాయణంలో అనేకం. మనోఫలకం మీద ఆ దృశ్యాన్ని ఊహించుకోగలిగితే గ్రాఫిక్స్ కోసమో, ఎఫెక్ట్స్ కోసమో హాలీవుడ్ సినిమాలు చూసి సమయాన్ని వృథా చేసుకోవాల్సిన పరిస్థితే రాదు. హనుమంతుడు అశోక వృక్షం మీద వాలే సమయానికి సీతా దేవి'ముక్కలైన విశ్వాసంలా ఉంది' అంటాడు. పొడిపొడి మాటల్లో ఎంత పదునైన వ్యక్తీకరణ? ఆ వర్ణనలూ అంతే. రావణుడు అపహరించే సమయానికి పసుపు పచ్చని చీరలో ఉంది సీతాదేవి. ఆకాశంలో పుష్పక విమానం ఎగిరిపోతుంటే.. ఆ గాలికి చీర కొంగు రెపరెపలాడుతున్నది. పక్కనే నల్లగా అంతెత్తున రావణుడు. ఆ దృశ్యం ఏదో పర్వతం మీద మంటలు అంటుకున్నట్టుగా ఉందట. ఎంత గొప్ప వర్ణన! రాముడు అరణ్యవాసానికి వెళ్లిపోగానే దశరథుడు దుఃఖంలో మునిగిపోతాడు.  అనారోగ్యం కబళిస్తుంది. చూపు మందగిస్తుంది. ఆ విషాదకర సన్నివేశంలో కౌసల్యతో ఓ మాట అంటాడు' రాముడు నా కనుపాప. తనతోపాటు నా చూపూ వెళ్లిపోయింది'.అనుబంధ వాచకం రాముడు భారతీయుల కుటుంబసభ్యుడు, గురువు, దేవుడు సమస్తం! భార్య భర్తలో రాముడిని చూసుకుంటుంది. తమ్ముడు అన్నలో రాముడిని చూసుకుంటాడు. తండ్రి కొడుకులో రాముడిని చూసుకుంటాడు. కానీ నేటితరాలే, క్రమక్రమంగా రాముడికి దూరం అవుతున్నాయి.

రామాయణాన్ని దూరం చేసు కుంటున్నాయి. కాబట్టే, ఆ జీవితాల్లో సంక్షోభం మొదలవుతున్నది. బంధాలకు బీటలు పడుతున్నాయి. అనుబంధాల్ని ఆస్తులు మింగేస్తున్నాయి. అదెంత నీచమైన చర్యో శ్రీరాముడే సెలవిచ్చాడు. తమను కలవడానికి వస్తున్న భరతుడిని చూసి.. దండయాత్రకు బయల్దేరాడేమో అని శంకించాడు లక్ష్మణుడు. ఆ దాడిని ఎదుర్కో వడానికి ఆయుధాలు సిద్ధం చేసుకున్నాడు. ఆ సందర్భంలో రాముడు చెప్పిన మాట ఇది యద్ధవ్యం బాస్టవానాం వా మిత్రాణాం వాక్షయే భవేత్ నాహం తత్ ప్రతిగృహ్లియాం భక్ష్యాన్విషకృతానివ బంధువుల్నో మిత్రుల్నో దూరం చేసుకోవడం వల్ల లభించే సంపద విషం కలిపిన భక్ష్యం లాంటిది. దాన్ని నేను అస్సలు ముట్టుకోను .లాభాల కోసమో, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో అడ్డదారులు తొక్కే వ్యాపారవేత్తలకూ ఉన్నతాధికారు లకూ అయోధ్యకాండ ఓ హెచ్చరిక చేసింది. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా  సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదమ్.సిరిసంపదల దేవత అయిన లక్ష్మి ఎల్లప్పుడూ సత్యాన్నే ఆశ్రయించి ఉంటుంది. మనం సత్యా నికి దూరమైతే ఆ సిరి దేవి కూడా మనకు దూరమైపోతుంది. జైలుపాలూ బెయి లుపాలూ అవు తున్న మాజీ కుబే రుల వైఫల్య కారణం ఇదే. రామకథ  తెలియక పోవడం వల్ల కావచ్చు, నవత రానికి జీవితం పట్ల ప్రేమఉండటం లేదు. సమస్యలతో పోరాడే తెగువ కనిపించడం లేదు. ఏ చిన్న ఇబ్బంది ఎదురైనా చావులోనే పరిష్కారాన్ని వెదుక్కుంటున్నారు. చేజేతులా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. నిద్ర మాత్రలు మింగడానికి ఓ పూట ముందో, ఉరితాడు బిగించుకోడానికి ఓ రోజు ముందుకనీసం సంక్షిప్త రామాయణాన్ని తిర గేసినా తమ నిర్ణయం ఎంత మూర్ఖమైందో అర్థమైపోతుంది. 'బతికుంటే ఏదో ఒక రోజు విజయాన్ని సాధించవచ్చు. అదే చావును ఎంచుకుంటే, ఆ ఆస్కారమే ఉండదు' అని  సలహా ఇస్తుంది రామాయణం. ఎట్టి పరిస్థితి లోనూ విషాదాన్ని మనసులోకి రానివ్వకూడదని సలహా ఇస్తాడు వాల్మీకి. 'విషాదం మహా దుర్మార్గమైంది. కోపంతో బుసలు కొడుతున్న పాము, అమాయకుడైన పసివాడిని కాటేసినట్టు... విషాదం అంతెత్తు మనిషిని కూడా మింగేస్తుంది' అని బోధిస్తుంది. తల్లిదండ్రుల పట్ల దయలేని పిల్లల్ని దాశరథి రామ బాణం లాంటి ఓ మాట అంటాడు... 'కన్నవారిని గౌరవించలేని వారికి, దేవుడిని పూజించే అర్హతాఉండదు'.

ఆదికావ్యం.. ప్రాంతీయ,జాతీయ, అంతర్జాతీయ సాహిత్యాలకూ మహోపకారం చేసింది. కేంద్ర సాహిత్య అకాడమీ.... రామాయణం ఆధారంగా వచ్చిన గ్రంథాల వివరాలు సేకరించింది. వరుసగా పేర్లు రాసుకుంటూ వెళ్తే రెండు సంపుటాలు ప్రచురించాల్సి వచ్చింది. రామాయణాలే వెయ్యికి పైగా ఉన్నాయి. ఉర్దూ, నేపాలీ, జర్మన్ ఇలా దాదాపు యాభై భాషల్లోకి రామాయణాన్ని అనువదించుకున్నారు. జైనులూ, బౌద్ధులూ కూడా ఆ గ్రంథాన్ని కళ్లకు అద్దుకున్నారు.రామాయణ తత్వాన్ని మరింత లోతుగా విశ్లేషిస్తూ రామరహస్యోపనిషత్తు, సీతోపనిషత్తు తదితర ఆధ్యాత్మిక గ్రంథాలూ వెలువడ్డాయి సీతారాములు నాయికానాయకులుగా ప్రాణం పోసుకున్న నాటకాలూ చలనచిత్రాలూ జానపద గాథలూ వర్ణచిత్రాలూ లెక్కలేనన్ని. తెలుగువారైన త్యాగయ్య,రామదాసు, తూము నరసింహదాసు, అన్నమయ్య తదితర వాగ్గేయకారులు తమ సంకీర్తనలతో రామసార్వభౌముడిని అర్చించారు. తరించారు. వాల్మీకి రామాయాణాన్ని గద్యంలా చదువుకోవచ్చు. లయబద్ధంగా పాడుకోనూవచ్చు. కాబట్టే, 'పాఠ్యేగేయేచ మధురం'అంటారు లాక్షణికులు. ఆదికావ్యం తదనంతర కవులకు కూడా పెద్దబాలశిక్షలా ఉపయోగపడింది. అందుకేనేమో భోజుడు వాల్మీకిని 'మార్గదర్శిః మహర్షి!' అంటూ కొనియాడారు. అతడికో కథ చెబుతుంది'ఓ పులి పరిగెత్తుకుంటూ వేటగాడికి ఎదురొచ్చింది. దీంతో వేటగాడు భయంతో చెట్టు ఎక్కాడు. అప్పటికే ఓ కొమ్మ మీద ఎలుగుబంటి ఉంది. 'నువ్వేం భయపడవద్దు. నేను నీకు హానిచేయను' అని అతడికి హామీ ఇచ్చింది ఎలుగుబంటి. వేటగాడు ఊపిరి పీల్చుకున్నాడు. వేటగాడు మన ఉమ్మడి శత్రువు. తోసెయ్' సలహా ఇచ్చింది కింది నుంచి పులి. అయినా, ఎలుగుబంటి ఆ మాట వినలేదు. కొద్దిసేపటికి ఎలుగు బంటి నిద్రలోకి జారుకుంటుంది. అదే అదనుగాభావించి... 'వేటగాడా ! ఆ ఎలుగుబంటిని నమ్మొద్దు. నేను వెళ్లిపోయాక నిన్ను తినేయాలని దాని పన్నాగం. ముందు దాన్ని కిందికి తోసెయ్' అని చెప్పింది జిత్తుల మారిపులి. వేటగాడు నిజమే అనుకున్నాడు. కిందికి తోసే శాడు. మనిషిలోని కృతఘ్నుడిని బట్టబయలు చేసే కథ ఇది. మరో కథలో రాజు ఓ బ్రాహ్మణునికి గోవును దానం చేస్తాడు. అది కాస్తా మందలో తప్పిపోయి రాజు గారి పశువులలో కలుస్తుంది. రాజు దాన్నే ఇంకో బ్రాహ్మ ణుడికి దానం చేస్తాడు. మొత్తానికి ఇద్దరూ ఆగోవు నాదంటే నాదంటూ గొడవపడతారు. న్యాయం కోసం ప్రభువు దగ్గరికి వెళ్తారు. ఎన్ని రోజులు ఎదురు చూసినా రాజదర్శనం లభించదు. నిరాశతో పాలకుడికి శాపం పెట్టి వెళ్లిపోతారు. పాలకులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలనేది ఈ కథలోని నీతి. 'రాజా ప్రియద ర్శనః' అన్న చాణక్య నీతికి ఈ కథ ఆధారం కావచ్చు.

అరణ్యవాస సమయంలో విల్లంబులతో తిరుగుతున్న రాముడికి సీత ఓ కథ చెబుతుంది... 'ఆయుధం మహాప్రమాదకారి. మనసును క్రూరంగా మార్చేస్తుంది. పూర్వం ఓ ముని తీవ్రమైన తపస్సు చేసుకుంటున్నాడు. అది చూసి ఇంద్రుడు అభద్రతకు లోనయ్యాడు. కొంప దీసి ఇంద్ర పదవిని కోరుకుంటాడేమో అన్న అనుమానం మొదలైంది. దీంతో మాయా రూపంలో వెళ్లి 'స్వామీ! నేను పరదేశిని. ఈ ఆయుధాన్ని మీ దగ్గర భద్రపరుచుకోండి. తిరుగు ప్రయాణంలో తీసుకుంటాను' అని కోరాడు. కాదనడానికి ఏ కారణమూ కనిపించలేదు మునీశ్వరుడికి. ఆయుధాన్ని తన కమండలం పక్కన పెట్టుకున్నాడు. కానీ, ఆయుధం చేతిలోకి రాగానే అతడి ఆలోచనలు మారిపోసాగాయి. మొదట మొక్కల్నీ కొమ్మల్నీ నరికాడు. ఆ తర్వాత జంతువుల ప్రాణాలూ తీయసాగాడు. దీంతో ఆలోచనలు పక్కదారి పట్టాయి. క్రూరాత్ముడిగా మారాడు. నరకానికి చేరుకున్నాడు'ఇలా, వ్యక్తిధర్మం నుంచి రాజధర్మం వరకూ రామాయణంలో లేనిదంటూ లేదు. ఆ సూత్రాలు పైపై నీతిబోధలు కావు. ఆచరణాత్మకాలు. జీవితమనే ప్రయోగశాలలో తానే ఓ గాజు నాళికగా మారిపోయి సత్య పరీక్షలు జరుపుకొన్నాడు శ్రీరాముడు. అంతిమంగా సత్యమే గెలు స్తుందని నిరూపించాడు. కాబట్టే, భారతీయులు రాము డిని గుండెల్లో నింపుకొన్నారు. రామాయణాన్ని నెత్తిన పెట్టుకున్నారు. రామాయణాన్ని దూరం చేసుకున్న కొద్దీ.. రావణుడికి దగ్గరవుతున్నట్టే! క్రమక్రమంగా పదితలల మృగంలా మారుతున్నట్టే! జాగృతః జాగృతః జాగృతః

గగనం గగనాకారం. సాగరః సాగరోపమః రామరావణ యోర్యుద్ధం రామరావణ యోరివ

ఆకాశానికి ఆకాశమే సాటి. సముద్రానికి సముద్రమే సాటి. రామరావణ యుద్దానికి రామరావణ యుద్ధమే సాటి.

రాముడంటే శుచిః : మనసూ శరీరమూ పరిశుభ్రమే. సానుక్రోశః : దయామయుడు. సమదుఖః : ఇతరుల బాధల్ని పంచుకునేవాడు. అహింసా చభూతానాం : ఏ జీవికీ హింస చేయనివాడు. సత్యవాదిన్ : నిత్యం సత్యమే పలికేవాడు. క్రియాపరః : కర్తవ్యానికి  ప్రాధాన్యం ఇచ్చేవాడు. సమర్థః : సర్వసమర్థుడు. సారగ్రాహిన్ : ఏ విషయాన్ని అయినా ఇట్టే ఆకళింపు చేసుకోగలవాడు ధర్మస్య పరిరక్షితా : ధర్మాన్ని కాపాడేవాడు. సర్వసమః : ప్రజలందర్నీ సమానంగా చూసేవాడు, స్మితపూర్వభాషీ : చిరునవ్వుతో సంభాషణ ప్రారంభించేవాడు. నిత్యంప్రశాంతాత్మా: ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడు. నచానృతకథః : అబద్ధం పలకనివాడు. అప్రమత్తః : ఏమరుపాటు లేనివాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)