ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన నోబెల్ బహుమతి వైద్యశాస్త్రంలో విశేష సేవలందించి నందుకు ఈసారి ఇద్దరిని వరించింది. అమెరికాకు చెందిన డేవిడ్ జూలియస్, అర్డెమ్ పటాపౌటియన్లు సంయుక్తంగా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఉష్ణ గ్రాహకాలు, శరీర స్వర్శపై వీరు చేసిన పరిశోధనలకు నోబెల్ బహుమతి ఇస్తున్నట్లు నోబెల్ జ్యూరీ వెల్లడించింది. 'మానవ నాడీ వ్యవస్థలో ఉష్ణము, చలి, స్పర్శ వంటి సంకేతాలను ఎలా ప్రారంభిస్తాయోననే విషయాన్ని ఈ ఇద్దరు శాస్త్రవేత్తల ఆవిష్కరణలు స్పష్టంగా వివరించాయి. ఈ ఆవిష్కరణలు ఎన్నో శరీరక వ్యవస్థలు, వ్యాధుల పరిస్థితులను తెలుసుకోవడంలో ఎంతో కీలకమైనవి' అని నోబెల్ జ్యూరీ అభిప్రాయపడింది.