ఉత్తరప్రదేశ్లోని ఖుషీనగర్లో ఇవాళ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ద యాత్రికుల కోసం ఈ విమానాశ్రయం ఎంతో ఉపయోగపడనున్నది. దశాబ్ధాల ఆశలు, ఆశయాల ఫలితమే కుషీనగర్ విమానాశ్రయమని, ఎయిర్పోర్ట్ను ప్రారంభించడం సంతోషకరంగా ఉందని, ఇదో ఆధ్యాత్మిక ప్రయాణమని, ఇది ఎంతో సంతృప్తినిస్తోందన్నారు. ఖుషీనగర్ విమానాశ్రయం కేవలం ఎయిర్ కనెక్టివిటీ మాత్రమే కాదు అని, రైతులు, జంతు ప్రేమికులు, షాప్ ఓనర్లు, వర్కర్లు స్థానిక పారిశ్రామికవేత్తలకు దీని ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. వ్యాపార సముదాయ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోందన్నారు. ఈ విమానాశ్రయం వల్ల పర్యాటక రంగం ఎక్కువగా లబ్ధి పొందుతోందన్నారు. స్థానిక యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. రానున్న 4 ఏళ్లలో దేశవ్యాప్తంగా 200 విమానాశ్రయాలు, హెలిపోర్ట్లను నిర్మించనున్నట్లు చెప్పారు. గౌతమ బుద్దుడితో సంబంధం ఉన్న అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మోదీ అన్నారు. బౌద్ద భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ఆయన వెల్లడించారు. ఖుషీనగర్ అభివృద్ధి కేంద్ర, యూపీ ప్రభుత్వ ఎజెండాలో ఉందన్నారు. యూపీలో కొత్తగా 9 విమానాశ్రయాలను నిర్మిస్తున్నామని, జివార్ విమానాశ్రయం దేశంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ అవుతుందని ప్రధాని తెలిపారు. అంతకుముందు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా.. ప్రధాని మోదీని సన్మానించారు. యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ భక్తులు ఇక్కడకు వస్తుంటారు. గౌతమ బుద్ధుడు ఇక్కడే మహానిర్యాణం పొందారు. బౌద్ద ఆధ్యాత్మిక యాత్రికులకు ఇదో చాలా ముఖ్యమైన యాత్రాస్థలం. ఖుషీనగర్ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీలంక నుంచి తొలి విమానం ఇక్కడ ల్యాండ్ అయ్యింది. ఆ విమానంలో శ్రీలంక మంత్రులతో పాటు బౌద్ద మతగురువులు వచ్చారు.