టాటా సన్స్ చేతికి ఎయిర్ ఇండియా?

Telugu Lo Computer
0



ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా సంస్థను టాటా సన్స్ దక్కించుకున్నట్లు ప్రముఖ వాణిజ్య వార్తా సంస్థ బ్లూమ్ బెర్గ్ పేర్కొంది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా భారత ప్రభుత్వం ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటాలను అమ్మకానికి పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ సంస్థను కొనుగోలు చేసేందుకు టాటా సన్స్ గ్రూపు, స్పైస్ జెట్ బిడ్లను దాఖలు చేశాయి. అయితే స్పైస్ జెట్ కన్నా ఎక్కువ మొత్తం కోట్ చేసి ఎయిర్ ఇండియాను టాటా సన్స్ సొంతం చేసుకున్నారు. ప్రభుత్వం చెప్పిన కనీస ధర కన్నా దాదాపు రూ. 3వేల కోట్లు ఎక్కువకు బిడ్ దాఖలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఎయిర్ ఇండియాలో 100 శాతం పెట్టుబడులను కేంద్రం ఉపసంహరించుకున్నట్లయింది. కేంద్ర హోంశాఖ నేతృత్వంలోని నిపుణుల బృందం టాటా సన్స్ సమర్పించిన బిడ్‌కు ఓకే చెప్పింది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో తుది ప్రకటన చేయనుంది. డిసెంబరు నాటికి ఎయిర్ ఇండియాను పూర్తిగా టాటాపు అప్పజెప్పనున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ ఇండియా సంస్థ 67 ఏళ్ల తర్వాత మళ్లీ సొంత యజమాని చేతుల్లోకి వెళ్తోంది. స్వాతంత్య్రానికి ముందే 1932లో జేఆర్డీ టాటా.. టాటా ఎయిర్‌ సర్వీస్ పేరుతో విమానయాన సంస్థను నెలకొల్పారు. 1946లో అదే ఎయిర్ ఇండియాగా మారింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. 1953, సెప్టెంబరు 13న భారత ప్రభుత్వం ఎయిర్ ఇండియాను జాతీయం చేసింది. దాంతో అప్పటి దాకా ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌గా ఉన్న ఎయిర్ ఇండియా.. ప్రభుత్వ సంస్థగా మారిపోయింది. అయినప్పటికీ 1977 వరకు దానిని స్థాపించిన జేఆర్బీ టాటానే ఛైర్మన్‌గా ఉన్నారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ టాటాల చేతికే ఏయిర్ ఇండియా వెళ్లింది. ప్రస్తుతం టాటాలు విస్తారా ఏయిర్ లైన్స్‌తో పాటు ఎయిర్ ఏసియాలోనూ వాటాలు కలిగి ఉన్నారు. ఎయిర్ ఇండియా 2007 నుంచి నష్టాల్లో మునిగిపోయింది. రాజకీయ జోక్యం పెరిగిపోవడం, నిర్వాహాణపరమైన లోపాల కారణంగా నష్టాలే తప్ప లాభాలు రావడం లేదు. ప్రతి రోజు సుమారు 20 కోట్ల నష్టాన్ని చవిచూస్తోంది. ఇప్పటి వరకు 70 వేల కోట్ల నష్టంలో కూరుకుపోయి దివాళా తీసింది. అలాంటి ఎయిర్ ఇండియాను టాటా కంపెనీ చేజిక్కించుకోవడం సంస్థ ఉద్యోగులకు కొంత ఊరటనిచ్చే అంశం. ఉప్పు నుంచి హెలికాప్టర్ల వరకు అనేక రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించిన టాటా గ్రూపు.. విమానయాన రంగంలోకి రావాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఎయిర్ ఇండియా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిన తర్వాత.. టాటా ఎయిర్ లైన్స్ ఏర్పాటు చేయాలని టాటా గ్రూప్ భావించింది. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అదే సమయంలో నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను కేంద్రం విక్రయానికి పెట్టడంతో ఆ సంస్థ కొనుగోలుకు ముందుకొచ్చింది. ఎక్కువ బిడ్ కోట్ చేసి ఎట్టకేలకు ఎయిర్ ఇండియాను దక్కించుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)