వచ్చే నెలలో జరగనున్న సెమిస్టర్ పరీక్షలకు గానూ విద్యార్థులు తమకు వెసులుబాటు ఉండేలా సెంటర్లను మార్చుకోవచ్చని బుధవారం సీబీఎస్ఈ ప్రకటించింది. తాము విద్య అభ్యసిస్తున్న పాఠశాలలు ఉన్న నగరాల్లో కాకుండా కొందరు విద్యార్థులు ప్రస్తుతం వేరే చోట్ల ఉన్నారని, వారు తమకు సౌలభ్యం ఉండేలా ఆయా ప్రాంతాల్లోనే పరీక్షలు రాసేలా వీలు కలిగిస్తున్నట్టు తెలిపింది. ''పరీక్ష కేంద్రాలను మార్చుకునే విషయమై విద్యార్థులకు తగిన సమయంలో సమాచారం ఇస్తాం. వారు సీబీఎస్ఈ వెబ్సైట్లోనే ఈ విషయమై విజ్ఞాపన పంపించాల్సి ఉంటుంది. ఇందుకు తక్కువ సమయమే ఇస్తాం. అందువల్ల విద్యార్థులు, పాఠశాలలు ఎప్పటికప్పుడు ఈ వెబ్సైట్ను పరిశీలించాల్సి ఉంది. పాఠశాల ఉన్న నగరంలోనే వేరే పరీక్ష కేంద్రానికి మార్చాలన్న విజ్ఞప్తులకు అవకాశం లేదు'' అని ఎగ్జామినేషన్ కంట్రోలర్ సంయం భరద్వాజ్ తెలిపారు. పదో తరగతి మొదటి సెమిష్టర్ పరీక్షలు నవంబరు 30 నుంచి, 12వ తరగతి పరీక్షలు డిసెంబరు ఒకటి నుంచి జరుగుతాయి.