శ్రీలంకలో విదేశీ మారకద్రవ్య సంక్షోభం తీవ్రమైంది. ప్రస్తుతం ఆ దేశంలో చమురు కొనుగోళ్లకు చెల్లించేందుకు కూడా నిధులు లేవు. దీంతో 500 మిలియన్ డాలర్ల రుణాన్ని ఇవ్వాలని భారత్ను కోరింది. ప్రస్తుతం ఉన్న చమురు నిల్వలు వచ్చే జనవరి వరకు మాత్రమే సరిపోతాయని ఆ దేశ ఇంధన శాఖ మంత్రి ఉదయ గమ్మన్పిలా హెచ్చరించిన కొద్ది రోజులకే ఈ ప్రతిపాదన వచ్చింది. ప్రభుత్వ రంగంలోని సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ దాదాపు 3.3 బిలియన్ డాలర్లను బ్యాంక్ ఆఫ్ సిలోన్, పీపుల్స్ బ్యాంక్కు చెల్లించాల్సి ఉంది. ఈ సంస్థ మిడిల్ఈస్ట్, సింగపూర్ నుంచి వివిధ రకాల పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకొంటోంది. ''భారత్ నుంచి 500 మిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ కోసం భారత్ హైకమిషన్లో ప్రయత్నాలు చేస్తున్నాం. ఇండో-శ్రీలంక ఎకనామిక్ పార్టనర్ షిప్ ఒప్పందంలో భాగంగా దీనిని కోరుతున్నాం'' అని సీపీసీ ఛైర్మన్ సుమిత్ విజయ్సింఘే పేర్కొన్నారు. ఈ నిధులను పెట్రోలియం, డీజిల్ దిగుమతులకు వినియోగిస్తామని తెలిపారు. త్వరలో భారత్, చైనా ఇంధన శాఖ కార్యదర్శులు ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉంది.