తన జీవితంలో ఎన్నడూ అవినీతితో రాజీ పడలేదని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తెలిపారు. కొత్తగా నియమితులైన అధికారులతో గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన పలు విషయాలను వెల్లడించారు. ''జమ్మూకశ్మీర్ గవర్నర్గా ఉన్న సమయంలో రెండు దస్త్రాలపై సంతకాలు పెడితే రూ.300 కోట్లు వస్తాయని నా కార్యదర్శులు చెప్పారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఆరెస్సెస్తో అనుబంధం ఉన్న వ్యక్తికి చెందిన సంస్థల దస్త్రాలవి. ఒత్తిళ్లకు భయపడదలచుకోలేదు. వాటిని తిరస్కరించాను. ఈ అవినీతి వ్యవహారాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన నా నిర్ణయాన్ని సమర్థించారు. అవసరమైతే పదవిని వీడేందుకూ ఆ సమయంలో సిద్ధపడ్డాను' అని మాలిక్ వెల్లడించారు. మాలిక్ ప్రసంగ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.