కర్ణాటకకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ను దూషించిన కేసులో భజరంగ్ దళ్ లీడర్ సహా 100 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఏడాది అక్టోబర్ 17న హుబ్లీలో మత మార్పిడిలకు వ్యతిరేకంగా భజరంగ్ దళ్ లీడర్ అశోక్ అన్వేకర్, ఆయన మద్దతుదారులు కలిసి స్థానిక పోలీసు స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. హుబ్లీలో మత మార్పిడిలను ప్రోత్సహిస్తున్న వారిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. మత మార్పిడిలను ప్రోత్సహిస్తున్న వారికి ఐపీఎస్ ఆఫీసర్ కే రామరాజన్ మద్దతు ఇస్తున్నారని నిరసనకారులు ఆరోపించారు. రామరాజన్ దేశ ద్రోహి అని దూషించారు. ఐపీఎస్ ఆఫీసర్ను ఇక్కడ్నుంచి బదిలీ చేయకపోతే పోలీసు కమిషనర్ ఆఫీసును దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. ఐపీఎస్ ఆఫీసర్ రామరాజన్ను దూషించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. భజరంగ్ దళ్ లీడర్ వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో భజరంగ్ దళ్ లీడర్ సహా 100 మందిపై కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.