ఈమని శంకరశాస్త్రి

Telugu Lo Computer
0


ఈమని శంకరశాస్త్రి  ప్రముఖ వీణ విద్వాంసుడు. ఈయన ద్రాక్షారామంలో జన్మించారు.ఆయన తాతగారైన సుబ్బరాయశాస్త్రిగారూ, తండ్రి అచ్యుతరామశాస్త్రిగారూ కూడా గొప్ప వీణ విద్వాంసులు. అచ్యుతరామశాస్త్రిగారు పాత పద్ధతిలో వీణను సితార్ లాగా నిలువుగా పట్టుకుని వాయించేవారు. శంకరశాస్త్రి తండ్రి వద్దనే వీణ నేర్చుకున్నారు. తన మూడో ఏటనే సంగీతంలో ప్రతిభ కనబరిచిన శంకరశాస్త్రికి సంగీతం వృత్తిగా పనికిరాదని ఆయన తండ్రి అనుకున్నప్పటికీ అదే జరిగింది. కాకినాడ పిఠాపురం రాజా కాలేజీలో డిగ్రీ పుచ్చుకున్నాక ఆయన వైణికుడుగానే జీవితం ప్రారంభించారు.1940లో తిరుచ్చి రేడియో కేంద్రంలో మొదటగా వీణ కచేరీ చేశాక ఆయనకు పేరు లభించసాగింది. వీరు తమ తండ్రిగారైన అచ్యుతరామశాస్త్రి గారి దగ్గర వీణ అభ్యసించి ఈ వాద్యాన్ని పూర్తిగా తెలుగువీణగా రూపుదిద్దారు. ఈయన విధానం ఎవ్వరికీ అనుకరణగా ఉండదు. వీణానాదంలో అతి సున్నితంగాను, అతి గభీరంగాను... రెండు విధాలుగానూ ఆయన వీణానాదం ఉంటుంది. వీణ మీదే గిటారు, సితార్, గోటు వాద్యాలను పలికించేవారు. భారతదేశంలో కాంటాక్ట్ మైక్‌ను మొదటగా వీణకు వాడి, వీణానాదంలో నయగారాలు తెచ్చిన మొట్టమొదటి వైణికుడు ఈమని శంకరశాస్త్రి. లలితసంగీతం, శాస్త్రీయ సంగీతం... రెండింటినీ ఒకదానిలో ఒకటి సమ్మిళితం చేసిన ఘనత శాస్త్రిగారిదే. జెమినీ స్టూడియోలో వాసన్ గారి దగ్గర కొంతకాలం పనిచేసి, కొన్ని హిందీ సినిమాలకు, కొన్ని తెలుగు సినిమాలకు సంగీత దర్శకునిగా నిలబడగలగటానికి కారణం ఆయనలోని ఆధునికతే. ఆ తరువాత ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో ఉద్యోగబాధ్యతలు నిర్వర్తించారు. కేవలం తాను నేర్చుకున్న కర్ణాటక సంగీతంలోని కీర్తనలను మాత్రమే వాయించకుడా, లౌకిక ప్రపంచంతో కూడా తన సంగీతాన్ని అనుసంధానించారు. టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ అధిరోహించిన వార్తను విన్న శంకరశాస్త్రిగారు, ‘ఆదర్శ శిఖరారోహణం’ అని ఒక సంగీత కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేశారు. ఈ కార్యక్రమాన్ని విన్న శ్రోతలు, తాము ఎవరెస్టును అధిరోహిస్తున్న అనుభూతిని పొందినట్లు చెప్పారు.. ఇటువంటిదే ‘భ్రమర విన్యాసం’ అనే మరొక సంగీత రూపకం. ఈ కార్యక్రమాన్ని విన్నవారు, వారి పక్కనే తుమ్మెద ఝంకారం ఉన్న అనుభూతిని పొందారట. ఈనాడు వాద్యవిద్వాంసులు చేస్తున్న ప్రయోగాలకు ఆద్యులు శంకరశాస్త్రిగారే. గమకాలు వేయడంలో, స్వర కంపనంలో, రాగాలాపనలో, స్వరప్రస్తారంలో, తానం వేయటంలో, ఒక మెట్టు నుంచి మరో మెట్టుకు స్వరాలు వేస్తున్నప్పుడు నిశ్శబ్దం వచ్చేలా చేయడంలో, స్వరనాదంలో హెచ్చుతగ్గులు ప్రదర్శించడంలో... సంగీతంలోని అన్నివిభాగాలలో ఎన్నో కొత్త మార్గాలను సృష్టించారు. సంగీతంలో ఉన్న గమకరీతులకు తోడు, మరో ఏడు రీతులను సృష్టించిన స్రష్ట శాస్త్రిగారు. ఆయన 1942-50 మధ్యలో మద్రాసులోని జెమినీ స్టూడియోలో సాలూరు రాజేశ్వరరావుకు సంగీత దర్శకత్వంలో అసిస్టెంటుగా పనిచేశారు. ఆ కాలంలోనే చిట్టిబాబు ఆయనకు శిష్యుడయారు.1951లో పి.బి.శ్రీనివాస్‌ను సినీ గాయకుడుగా పరిచయం చేసారు.1953 ప్రాంతాల్లో శంకరశాస్త్రి జెమినీలో అనేక సినిమాలకు పనిచేశారు. ‘సీతారామకల్యాణం’ చిత్రంలో రావణుడు వీణవాయించే ఘట్టంలో, ప్లేబ్యాక్‌లో శంకరశాస్త్రి వీణ వాయించారు. ‘వెంకటేశ్వర మహాత్యం’ సినిమాలో వాచస్పతి రాగంలో వీణ వాయించారు. తన కచేరీలలో అప్పుడప్పుడూ పాట పాడి వినిపిస్తూ, వీణ మీద అవే సంగతులు పలికించేవారు. మంత్ర పుష్పం వంటివి వాయిస్తున్నప్పుడు, ‘ప్రజా’ వంటి పదాలను ఉచ్చరిస్తూ కుడిచేత్తో అందుకు అనుగుణంగా రెండు తీగెల మీద డబుల్ మీటు వేసేవారు. ఇక సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఆయన తీగెలను కుడిచేత్తో మీటే పద్ధతి గొప్పగా ఉండేది. చేతి పొజిషన్‌ను నాలుగైదు రకాలుగా మార్చేవారు. అది అనితరసాధ్యం. మూడో తీగనూ, నాలుగో తీగనూ బొటనవేలితో మీటుతూ, మంద్ర, అనుమంద్ర స్థాయిల్లో వాయించేవారు. రాగస్వభావాన్ని గంభీరంగా, హుందాగా వినిపించడంలో ఆయనకు ఆయనే సాటి. తాను పూర్తిగా సంగీతంలో లీనమై, ప్రేక్షకుల ఉనికిని కూడా గమనించకుండానే వారిని కూడా సంగీతంలో ఓలలాడించేవారు. హిందుస్తానీ కళాకారులతో జుగల్‌బందీ చేయడం ఆయనకు సులభ సాధ్యం. కచేరీలో వీణ బుర్ర మీద జాజ్ శబ్దం వాయిస్తూ స్వరరచనలు చేసేవారు. మంద్రస్థాయిలో అచ్చు గిటార్ లాగే వినపడేది. కదనకుతూహల రాగంలో ‘రఘువంశ సుధాంబుధి చంద్ర’ కీర్తనను ద్వారం వెంకటస్వామినాయుడు గారి పద్ధతిలో వెస్టర్న్ కార్డ్స్ ఉపయోగించేవారు. వీణ మీద ఎన్ని రకాల శబ్దాలు చేయవచ్చో సంపూర్ణంగా అర్థం చేసుకున్న కళాకారుడు శాస్త్రిగారు. కచేరీలు చేస్తున్నప్పటికీ ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు సంగీతసాధన చేసేవారు. సాధన చేయకుండా ఎప్పుడూ కచేరీ ఇచ్చేవారు కాదు. అమలాపురం కోనసీమ బ్యాంక్ ఆవరణలో ఒకసారి చిట్టిబాబు, ఈమనిగారు కలిసి ఒక చిన్న కచేరీ ఇచ్చారు. ఇద్దరికీ సన్మానం చేశారు. సంగీతబ్రహ్మ త్యాగ్యం తన చివరి రోజులలో ‘మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు కానివారలకు’ అనే కీర్తన పాడేవారని చరిత్ర చెబుతోంది. యాదృచ్ఛికమో ఏమో కాని, శాస్త్రిగారు గుంటూరులో చేసిన ఆఖరి కచేరీలో కూడా ఇదే కీర్తన వాయించారు.  1940లో తిరుచ్చి రేడియో కేంద్రంలో మొదటగా వీణ కచేరీ చేశాక ఆయనకు పేరు లభించసాగింది. అలా మెల్లగా ఎదుగుతూ వచ్చారు. ఆకాశవాణి డైరక్టరేట్ లో సంగీత విభాగంలో చీఫ్ ప్రొడ్యూశర్ గా పనిచేసిన మరో ప్రముఖులు ఈమని శంకరశాస్త్రి. వైణికులుగా లబ్ధ ప్రతిష్ఠులైన శంకరశాస్త్రి ఢిల్లీలో సముచిత గౌరవాన్ని పొందారు. విమానం ఎక్కడమంటే ఆయనకు చాలా భయము. అందువల్ల ఆయన ఎన్నిసార్లు విదేశాల నుంచి ఆహ్వానం వచ్చినా తిరస్కరించారు. చివరికి 1970వ దశకంలో ఫ్రాన్స్ వెళ్లి కచేరీలు చేశారు. అక్కడివారు ఎంతో సంబరపడ్డారు. ‘కాన్సర్ట్ ఆఫ్ ది సెంచురీ’ అని పత్రికలు ప్రశంసించాయి..

ఈమని శంకరశాస్త్రి 1987, డిసెంబరు 23న మరణించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)