పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చరణ్జీత్ సింగ్ చన్నీకి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయవతి శుభాకాంక్షలు తెలిపారు. అయితే, చరణ్జీత్కు ఇంకా ముందే ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొద్ది నెలల సమయం ఉండగా చరణ్జీత్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడాన్ని చూస్తుంటే ఇది కేవలం ఎన్నికల జిమ్మిక్కుగా కనిపిస్తున్నదని మాయావతి అనుమానం వ్యక్తంచేశారు. వచ్చే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దళితేతర వ్యక్తి నాయకత్వంలో జరుగుతాయని మీడియాలో వార్తలు వస్తున్నాయని మాయావతి చెప్పారు. దీన్నిబట్టి కాంగ్రెస్ పార్టీ దళితుడైన చరణ్జీత్ను పేరుకు ముఖ్యమంత్రిని చేసినా, ఆ పార్టీకి దళితులపై పూర్తిగా విశ్వాసం లేదనే సంగతి అర్థమవుతున్నదని ఆమె విమర్శించారు. పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)-బహుజన్ సమాజ్వాది పార్టీ (బీఎస్పీ) కూటమిని చూసి కాంగ్రెస్ భయపడుతున్నదని ఆమె ఎద్దేవా చేశారు.