ఒకప్పటిలా క్రూర విధానాలను ఈ దఫా పాలనలో అనుసరించబోమని ఇన్నాళ్లూ చెబుతూ వచ్చిన తాలిబన్లు ఇప్పుడు మాట మార్చారు! అఫ్గానిస్థాన్లో 1990ల నాటి తరహాలోనే ఇప్పుడు కూడా కాళ్లు, చేతులు నరకడం వంటి కఠిన శిక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. తాలిబన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా నూరుద్దీన్ తురాబీ తాజాగా ఓ వార్తాసంస్థతో ముఖాముఖిలో మాట్లాడుతూ.. ''గతంలో మేం బహిరంగంగా శిక్షలను అమలు చేసినప్పుడు చాలా దేశాలు విమర్శలు గుప్పించాయి. కానీ మేమెప్పుడూ ఆయా దేశాల చట్టాలు, శిక్షల గురించి మాట్లాడలేదు. మా అంతర్గత వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకోకూడదు. మా చట్టాలు ఎలా ఉండాలో ఇతరులు చెప్పనక్కర్లేదు. మేం ఇస్లాంను అనుసరిస్తాం. ఖురాన్ ప్రకారమే చట్టాలు రూపొందించుకుం టాం. గత పాలన తరహాలోనే ఇప్పుడు కూడా దోషులను కఠినంగా శిక్షిస్తాం. చేతులు, కాళ్లు నరకడం వంటి శిక్షలను అమలు చేస్తాం. అయితే వాటిని బహిరంగంగా అమలు చేయాలా వద్దా అన్న దానిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి'' అని పేర్కొన్నారు. తాలిబన్ల గత ప్రభుత్వంలో తురాబీ న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో అఫ్గాన్లో హంతకులను బహిరంగంగా కాల్చిచంపడం, దొంగల కాళ్లు-చేతులు నరకడం వంటి శిక్షలు అమల్లో ఉండేవి.