భర్తను కిడ్నాప్ చేయించిన భార్య!

Telugu Lo Computer
0

విడాకుల కోసం ఓ భార్య తన భర్తను కిడ్నాప్ చేయించింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని మౌలాలీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌలాలీ ఆర్టీసీ కాలనీకి చెందిన షేక్‌ వాజీద్‌ , ఆప్షియా బేగంలు దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. షేక్ వాజీద్‌ చెప్పుల షాపులో సేల్స్‌ మ్యాన్‌గా పని చేస్తున్నాడు. అయితే ఆప్షియా బేగానికి సోషల్ మీడియాలో ముషీరాబాద్‌కు చెందిన ఆసిఫ్‌ పరిచయమయ్యాడు. అతను క్యాటరింగ్‌ పనులు చేసే వాడు. ఇద్దరి మధ్య పరిచయం చాలా దూరం వెళ్లింది. కాగా ఆసిఫ్‌ కు గతంలో రెండు పెళ్లిలు అయ్యాయి. అలాగే పిల్లలు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా గత ఏప్రిల్ లో ఆప్షియా బేగం ఇంట్లో చెప్పకుండా ప్రియుడి దగ్గరికి వెళ్లిపోయింది. దాంతో ఆమె భర్త మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను గుర్తించి ఆమె భర్తకు అప్పగించారు. మళ్లీ కొన్నాళ్లకు తిరిగి ఆమె తన ప్రియుడి దగ్గరకు పిల్లలతో సహా వెళ్లిపోయింది. దాంతో ఆమె భర్త.. అత్తామామల సాయంతో ఆమెను తిరిగి తీసుకొచ్చాడు. ఆప్షియా బేగం తన భర్తతో ఉండటం ఇష్టం లేదని, విడాకుల కావాలని చెప్పింది. అందుకు ఆమె భర్త అంగీకరించలేదు. దాంతో ఎలాగైనా ప్రియుడినే పెండ్లి చేసుకోవాలని ఆప్షియా నిర్ణయించుకుంది. భర్తను కిడ్నాప్ చేసేందుకు ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. ఆసిఫ్‌ అందుకోసం ముషీరాబాద్‌, పార్శీగుట్టకు చెందిన ఇమ్రాన్‌ మహ్మద్‌ , మహ్మద్ జాఫర్‌, ఇర్ఫాన్‌ అహ్మద్‌, మహమూద్‌ అనే వ్యక్తులను మాట్లాడాడు. వీరు నలుగురు రెండు బైక్‌లపై సోమవారం సాయంత్రం సికింద్రాబాద్‌లో వాజీద్‌ పనిచేస్తున్న షాపు వద్దకు వెళ్లి అతడిని బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ముషీరాబాద్‌కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి అప్పటికే వారు సిద్ధం చేసుకుని ఉంచిన మత పెద్దల సమక్షంలో విడాకులు ఇప్పించుకున్నారు. వాజీద్‌ కిడ్నాప్‌ విషయాన్ని అదేరోజు రాత్రి షాపు ఓనర్లు పోలీసులకు తెలియజేశారు. దాంతో బాధితుడి ఫోన్‌ లోకేషన్‌ ఆధారంగా పోలీసులు అతన్ని కాపాడారు. ఆప్షియా బేగంతోపాటు కిడ్నాప్‌నకు పాల్పడిన ఇమ్రాన్‌ అహ్మద్‌, జాఫర్‌లను అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి ఆసిఫ్‌తోపాటు ఇర్ఫాన్‌ అహ్మద్‌, మహమూద్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)