పి.బి.శ్రీనివాస్

Telugu Lo Computer
0

 


పి.బి.శ్రీనివాస్ పూర్తి పేరు ప్రతివాది భయంకర శ్రీనివాస్ చలనచిత్ర నేపథ్యగాయకుడు. తన మాతృభాష అయిన తెలుగులో కంటే కన్నడ, తమిళ చిత్రాలలో ఎక్కువ పాటలు పాడారు. హిందీ, మలయాళం చిత్రాలలో కూడా పాటలు పాడారు. కన్నడ నటదిగ్గజం రాజ్‌కుమార్‌కు ఇతను ఎన్నో గీతాలు ఆలపించారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ, ఉర్దూ, ఆంగ్ల, సంస్కృత భాషలలో దిట్ట. పీబీ ఎన్నో గజళ్లు వ్రాశారు. ఈయన  గళం సువర్ణ గళంగా గుర్తింపు పొందింది. మొట్ట మొదటిసారిగా జాతక ఫలం చిత్రంలో పాడారు.  సుమారు 3000 లకు పైగా పాటలు పాడారు. ఆంధ్రపదేశ్ లో తూర్పు గోదావరి జిల్లా లోని కాకినాడ పట్టణమునందు ఫణీంద్ర స్వామి, శేషగిరమ్మ దంపతులకు సెప్టెంబర్ 22, 1930 న జన్మించారు.  బి.కాం. డిగ్రీని సంపాదించారు. పూర్వీకులు పసలపూడి గ్రామానికి చెందినవారు. ఎనిమిది భాషలలో అనర్గళంగా మాట్లాడగలరు. అవి తెలుగు, కన్నడం, తమిళం, మళయాళం, హిందీ, ఉర్దూ, ఆంగ్లం,. అతను దేశంలోని ప్రధానమైన భాషలలో ఎన్నో పాటలు పాడినప్పటికీ ఎక్కువ పాటలను కన్నడ భాషలోనే పాడారు. తెలుగు చిత్రాల్లో ఎన్నో ప్రజాదరణ పొందిన పాటలను తన మధుర గాత్రంతో ఆలపించారు. శాంతినివాసం చిత్రంలో మహానటుడు నాగయ్య గారికి "శ్రీ రఘురాం జయ రఘురాం " అనే పాటను పాడటం విశేషం. తండ్రిగారు సంస్కృతపండితులు కావటం వల్ల సంస్కృతం శ్రీనివాస్‌కి చిన్ననాడే అబ్బింది. ఫణీంద్రస్వామి కంటే తల్లి శేషగిరమ్మ దగ్గర  చనువెక్కువ. తండ్రి క్రమశిక్షణకు పెట్టింది పేరు. తల్లి సంస్కృత విదుషీతల్లజ. కిడాంబి వారింటి ఆడపడుచు. ఆమెది కోయిల గొంతు. సంగీతకోవిద. గురువుల నుంచి శ్రీనివాస్ నేర్చుకొన్నదేమన్నా ఉంటే అది తల్లి నుంచే. ఆమే అతనుకు ఆది గురువు, తుది గురువు. తమిళనాడు ప్రభుత్వం  నుంచి కలైమామణి పురస్కారాన్ని అందుకొన్నారు. ఇంకా కర్ణాటక ప్రభుత్వ పురస్కారాన్ని, శ్రీ రాఘవేంద్ర మఠం వారి ప్రతిష్ఠాత్మకమైన సంగీత కళానిధి పురస్కారాన్ని అందుకొని ఆస్థాన విద్వాంసులుగా నియమితులయ్యారు. కంచి జగద్గురుపీఠం నుంచి  సంగీత రత్న, సంగీత నాథమణి బిరుదాలను స్వీకరించారు. ఆరిజోనా విశ్వవిద్యాలయం నుంచి సంగీత సాహిత్యాలకు అందించిన సేవలకు గాను డాక్టరేట్ గౌరవాన్ని కూడా అందుకొన్నారు. శ్రీనివాస్ 1952లో జెమిని వారి హిందీ చిత్రం "మిస్టర్ సంపత్"తో తన చలనచిత్ర జీవితం ప్రారంభించారు. అందులో అతను పాడిన పాట "ఆజి హం భారత్ కీ నారి" ఒక యుగళ గీతం. దీనిని "గీతా దత్త్ "తో కలిసి పాడి ప్రాముఖ్యత పొందారు.1955 లో మళయాళ చిత్రం "హరిశ్చంద్ర" లో పాడారు.అతను మొదటి సోలో సాంగ్ "ప్రేమ పాశం" చిత్రంలో పి.సుశీలతో పాడారు.ఇది ఎంతో విశిష్టతను సంతరించుకుంది. తర్వాత కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కు చాలా కాలంపాటు పాటలు పాడారు. ఇవి విమర్శకులచే, అభిమానులచే, పరిశ్రమచే కొనియాడబడ్డాయి. తమిళ పరిశ్రమలో జెమిని గణేశన్ కు అనేక పాటలు పాడారు. ఆయన పాడిన పాటలలో పేరొందిన పాట "నిలవే ఎన్నిదం నెరుంగతె". అతను ఇతర నటులకు కూడా అనేక సందర్భాలలో పాటలు పాడారు. ముఖ్యంగా కొన్ని పాటలను ఎం.జి.రామచంద్రన్, శివాజీ గణేశన్ లకు పాడారు.1964 లో మై భీ లడకీ హూ అనే హిందీ చిత్రంలో లతా మంగేష్కర్తో కలిసి పాడిన పాట "చందా సె హోగా వో ప్యారా" ఎంతో విశేషతను పొందింది. అతను కంఠం తమిళంలో అనేక మంది నటులకు ఉపయోగపడింది. వారు జెమినీ గణేశన్, ముత్తురామన్, రవిచంద్రన్, జైశంకర్. "పావా మనిప్పు" అనే చిత్రంలో కన్నదాసన్ వ్రాసిన "కలగాలి ఆవల్ వసంతమ్" అనే పాటను ఎం.ఎస్.విశ్వనాథన్, టి.కె.రామమూర్తి గారి సంగీత సారథ్యంలో పాడారు.అంజలీ పిక్చర్స్ వారి ఆడుతా వీట్టుప్పెన్ అనే చిత్రంలో కొన్ని పాటలు పాడారు. శ్రీనివాస్ గాయనీమణులైన పి.సుశీల, ఎస్.జానకి, పి.భానుమతి, కె.జమునా రాణి, ఎల్.ఆర్.ఈశ్వరి, లతా మంగేష్కర్ ల సరసన పాడారు. ఆధ్యాత్మిక పాటలను కూడా పాడారు. అవి "శారదా భుజంగ స్తోత్రం", "శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్", "ముకుంద మాల", "శ్రీ మల్లికార్జునస్తోత్రం", పురందరదాసు సంకీర్తనలు. చైన్నై లోని వుడ్‌లాండ్స్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ లో ఏ సమయములో ఆయనను సందర్శించినా ప్రశాంతంగా కవితలు వ్రాసుకుంటుండేవారు. పి.బి.శ్రీనివాస్ ఏప్రిల్ 14, 2013లో తన 82వయేట చెన్నై లోని ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)