ప్రతీకారం!

Telugu Lo Computer
0

 

ఓ వ్యక్తి     ఓ మహర్షి దగ్గరకు వెళ్ళి “స్వామీ! నాకు ద్రోహం తలచిన వారి మీద, నన్ను మోసం చేసినవారి మీద, నాపైన నిందమోపిన ప్రతి ఒక్కరి మీద పగ సాధించాలనిపిస్తున్నది. నన్ను ఏమి చేయమంటారు?” అని అడిగాడు.

ఒక సంచిని అతడి చేతిలో పెట్టి “దీనిలో నువ్వు ఎవరిపైన అయితే పగ సాధించాలి అని అనుకుంటావో వారి పేర్లను ఒక్కో ఆలుగడ్డపై రాసి ఈ సంచిలో వేసుకో! ఒక ఆలుగడ్డ పై ఒక్కరి పేరు మాత్రమే రాయాలి! నువ్వు ఎక్కడకు వెళ్లినా ఈ సంచిని మాత్రం మరిచిపోకూడదు! నీ వెంటే తీసుకువెళ్లాలి!” అన్నాడు. 

ఇంత సులువా ఇంకేదో చెప్తారనుకున్నానే అని చెప్పి సంచిని తీసుకుని బయల్దేరాడు.

అతడికి ఎవరిపైన అయితే కోపం ఉందో ఆ వ్యక్తి పేర్లు ఆ ఆలు గడ్డలపై రాసి వెంట తీసుకుని వెళ్ళాడు.

మొదట్లో అది ఇబ్బందిగా  అనిపించలేదు. ఆ తరువాత బరువు పెరిగింది. ఆలు కుళ్లిపోవడం మొదలయింది.

భరించలేని కంపు వస్తున్నది.

ఇప్పుడు ఇతని దగ్గరకు రావడానికి అందరూ అసహ్యించుకుంటున్నారు స్నేహితులు బంధువులు భార్య పిల్లలు అందరూ.

ఆలుగడ్డల్ని పడేసి ఆ సంచిని తీసుకుని స్వామిజీ దగ్గరకు వెళ్ళాడు…“ఏంటి స్వామిజీ ఇలా చేసారు… ఎవరూ నాదగ్గరకు కూడా రావడంలేదు నన్ను పగ సాధించవద్దని చెప్పించడానికేగా ఈ ప్రయత్నం అన్నాడు. అంటే నన్ను బాధ పెట్టినవారిని వదిలేయమని వారి పాపంలో వారు పోతారనేగా?” అన్నాడు.

”కాదు! నువ్వు వదిలేయడంకన్నా నీ మనసు నుండి తీసేయమని చెబుతున్నాను. చెడిపోయాయని ఆలూని పడేసావు. ఆ సంచినే పడేసుండాలని నేను అంటున్నాను. ప్రశాంతమైన మనసును నువ్వు కలిగిఉండాలని అంటున్నాను. నిన్ను బాధ పెట్టినవారు ఖచ్చితంగా అనుభవిస్తారు. దాన్ని తలచి నువ్వెందుకు బాధ పడడం? నువ్వు నీ పనిపైన మనసును లగ్నం చెయ్యి. సంతోషంగా ఉండు. ఏది మరిచిపోవాలో అది గుర్తుపెట్టుకుని బాధ పడడం ఎందుకు. ఏది గుర్తుపెట్టుకోవాలో వాటిని మరిచిపోయి సంతోషాన్ని దూరం చేసుకోవడం ఎందుకు?”అని చెప్పారు.

ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే అందరి జీవితాలు నందన వనమే.

Post a Comment

0Comments

Post a Comment (0)