స్వదేశీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ డీటెల్ సరికొత్త ఈవీ ఈజీ ప్లస్ టూ-వీలర్ను లాంచ్ చేసింది. ఈ కొత్త ఇ-బైక్ను రూ. 39,999 వద్ద విడుదల చేసింది. జీఎస్టీతో కలిపి రూ. 41,999 ధర వద్ద ఈ టూవీలర్ అందుబాటులో ఉంటుంది. ఇది సిల్వర్ గ్రే, మెటాలిక్ రెడ్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ రెండు వేరియంట్లను డీటెల్ ఇండియా అధికారిక వెబ్సైట్ ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఆసక్తిగల కొనుగోలుదారులు కొత్త ఈవీ ఈసీ ప్లస్ని కేవలం రూ. 1,999 టోకెన్ ధర చెల్లించి బుక్ చేసుకోవచ్చని తెలిపింది. మిగతా రూ. 40 వేలు టూవీలర్ డెలివరీకి 7 రోజుల ముందు చెల్లించాల్సి ఉంటుంది. గురుగ్రామ్కు చెందిన డీటెల్ టూ వీలర్ సంస్థ హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్తో సహా వివిధ రాష్ట్రాల్లో డీలర్షిప్ నెట్వర్క్ను కలిగి ఉంది. సమీప భవిష్యత్తులో ప్రధాన నగరాల్లోకి నెట్వర్క్ను విస్తరించాలని యోచిస్తోంది. కంపెనీ అధికారిక వెబ్సైట్ ప్రకారం, కొత్త EV ఈజీ ప్లస్ డ్రైవింగ్ రేంజ్ 60 కిలోమీటర్లు, గరిష్ట వేగం గంటకు 25 కిలో మీటర్ల వరకు ఉంటుంది. ఇందులో 20Ah బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీని రైడర్ సీటు క్రింద అమర్చారు. టైర్లు కూడా డ్రమ్ బ్రేక్ సిస్టమ్తో రూపొందాయి. ఇది 170 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ టూవీలర్ని 5 ఆంపియర్ స్లాట్లో పెట్టి ఛార్జ్ చేయవచ్చు. డీటెల్ కంపెనీకి చెందిన ఈజీ ప్లస్ టూవీలర్ రోడ్సైడ్ అసిస్టెన్స్, సర్వీసెస్, ఇన్సూరెన్స్లను కూడా అందిస్తోంది. దీన్ని ఈఎంఐ ఆప్షన్తో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ సరికొత్త వాహనంపై డీటెల్ వ్యవస్థాపకుడు డాక్టర్ యోగేష్ భాటియా మాట్లాడుతూ, "భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈసీ ప్లస్ మా బ్రాండ్ నుంచి విడుదలైన రెండవ ఉత్పత్తి. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందిన ఈ టూవీలర్ను సరసమైన ధర వద్దే అందిస్తున్నాం. ఇటీవలి కాలంలో భారత్లో ఎలక్ట్రిక్ టూవీలర్లకు డిమాండ్ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సమీప భవిష్యత్తులో మరిన్ని వాహనాలను లాంచ్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం." అని చెప్పారు.