కరోనా ఇబ్బందులు, ఆర్థిక కష్టాలు ఓ డ్యాన్స్ మాస్టర్ను గొలుసు దొంగతనానికి పురిగొల్పాయి. మొదటిసారి చోరీ చేసి పరారైనా ఒక్కరోజులోనే పోలీసులు అతడిని పట్టుకున్నారు. ఎస్సార్నగర్ ఠాణా ఇన్స్పెక్టర్ సైదులు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పి.వి.రాంప్రసాద్లు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం పెద్దంపల్లికి చెందిన డి.సుచరిత మాదాపూర్లోని ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. మధురానగర్లో హాస్టల్లో ఉంటున్న ఆమె గురువారం ఉదయం మధురానగర్ మెట్రో స్టేషన్ వద్ద లిఫ్ట్ కోసం ఎదురు చూడసాగింది. ఆ సమయంలో నల్గొండ జిల్లా నార్కట్పల్లికి చెందిన చింత వినోద్ (27) వెనుక నుంచి వచ్చి సుచరిత మెడలోని రూ.45వేల విలువైన బంగారు గొలుసును లాక్కెళ్లాడు. మెట్రోస్టేషన్ వద్ద సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాల ఆధారంగా నిందితుడిని శుక్రవారం అరెస్టుచేశారు. ఎంబీఏ చదివిన వినోద్ డ్యాన్స్మాస్టర్గా మారాడు. మధురానగర్లో హాస్టల్లో ఉంటున్నాడు. కరోనాతో ఉపాధి లేక, ఆర్థిక ఇబ్బందులతో గొలుసు చోరీకి పాల్పడ్డాడని ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు.
డ్యాన్స్ మాస్టర్ - గొలుసు దొంగయ్యాడు
August 21, 2021
0