సౌరశక్తి ....!

Telugu Lo Computer
0


సౌరశక్తి లో చాలా శక్తి వుందని ఇప్పటి శాస్త్రజ్ఞులు గ్రహించి సౌర శక్తితో ఎన్నో పనులు సాధిస్తున్నారు దాంతో వంట కూడా చేసుకోవచ్చని సోలార్ హీటర్లు తయారు చేస్తున్నారు. 

ఎంతో  కాలం క్రితమే మన పూర్వులు ఈ విషయం గ్రహించారు. అందుకే సూర్యుడిని దేవుడు గా భావించి పూజలూ రథసప్తమి నాడు సూర్య జయంతి ఉత్సవాలూ జరుపుకున్నారు. వేదాల్లో వున్నా సూర్య బీజాక్షరాలు చదివితే శక్తి లభిస్తుందని మన ఋషులు బోధించారు. 

1945 లో బెంగాలు కు చెందిన ఎం. కె. ఘోష్ సూర్యరశ్మి తో పనిచేసే పరికరం రూపొందించాడు. అయితే సౌర శక్తి వినియోగ ప్రస్తావన 500 ఏళ్ళ క్రితమే మన తెలుగు కవి శ్రీనాథుడు తన కాశీఖండ మనే కావ్యం లో చేసారు. భారతీయుల మేధా సంపత్తి విశేషమని  అనేక సంవత్సరాల పూర్వమే ఋజువైంది. ఇది శ్రీనాథుడు రచించిన కాశీఖండ కావ్యం లోనిది.    

దివోదాసుడనే రాజు  కాశీ పట్టణమును పాలించేవాడు. అతడు సూర్య వంశజుడు,ధర్మాత్ముడు. ఈయనకు రిపుంజయుడు   అనే పేరు కూడావుంది. ఒక సమయం లో దేవతలు ఆగ్రహించటం వలన కాశీ పట్టణం లో అగ్ని జ్వలించ లేదు. అ సమయం లో ఆయన సూర్య కిరణాల సాయం తో వుడికిన పదార్థాలు తిన్నాడట. 

   అంబుజ బాంధవాన్వయ నృపాగ్రణి బోనము నేడు సూర్య పా 

   కంబున నాయితనంబయిన కబ్జము భోజన శాల లోన బ 

   ల్యం బిదినారు పంకజదళాక్షులు రెండవ ఝాము ఘంట వ్రే 

   యంబడి నారగింప సమయంబని చెచ్చెర విన్నవించినన్ 

   వేల్పు లొనరించినట్టి దుర్వృత్తి యగుట 

   నెరిగి యింతియోకాక యొండేమి యనుచు 

   నారగించె దివోదాసుదారక కిరణ 

   తాప పక్వంబులగు పదార్థంబు లెలమి 

అర్థము:--పరిచారికలు వచ్చి సూర్యవంశ ప్రభువుల్లో గొప్పవాడా రిపుంజయ  మహా రాజా ఈ రోజు భోజనం సూర్య కిరణాల వేడితో తయారయింది. భోజనశాలలో పద్మ దళాలవంటి కన్నులు గల భామినులు పళ్ళెం లో పెట్టినారు రెండో ఝాము ఘంట  మ్రోగింది త్వరగా తినడానికి రండి అని పిలుస్తారు. అప్పుడు రిపుంజయుడు (దివోదాసు) దేవతలు అగ్నిని నిరోధించడం కంటే యింకేమి చేయగలరు అంటూ సూర్య కిరణాల వేడిమి తో తయారైన పదార్థాలు తిన్నాడట. ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం ఆవిష్కరించిన ఇలాంటి విషయాలేన్నింటి కో మన సాహిత్యం లో తార్కాణాలున్నాయి. పరిశోదించాలనే ఉత్సుకత ఉన్నవారికి పెన్నిధి మన తెలుగు సాహిత్యం. 

Post a Comment

0Comments

Post a Comment (0)