పింగళి వెంకయ్య

Telugu Lo Computer
0


పింగళి వెంకయ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపాన ఉన్న ప్రస్తుత మొవ్వ మండలములోని భట్లపెనుమర్రు గ్రామములో హనుమంతరాయుడు, వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి దివి తాలూకా యార్లగడ్డ గ్రామ కరణంగా ఉండేవారు. ఆయన తాత గారు అడివి వెంకటాచలం గారు చల్లపల్లి సంస్థానం ఠాణేదారు. ఆయనకి పెదకళ్ళేపల్లి బదిలీ కావటం వల్ల వెంకయ్యగారి ప్రాథమిక విద్య అక్కడే పూర్తి అయింది. ఆయన చిన్నప్పటి నుండే చాలా చురుకైన విద్యార్థి. ప్రాథమిక విద్య చల్లపల్లి లోను, మచిలీపట్నంలోని హిందూ ఉన్నత పాఠశాలలోనూ అభ్యసించారు. ఉన్నత పాఠశాల విద్య పూర్తిచేసుకొని సీనియర్ కేంబ్రిడ్జ్ చేయుటకు కొలంబో వెళ్లారు. చొరవ, సాహసం మూర్తీభవించిన అతను బొంబాయి వెళ్ళి, 19వ యేట సైన్యంలో చేరి దక్షిణాఫ్రికాలోని బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. స్వదేశం వస్తూ అరేబియా, ఆప్ఘనిస్థాన్ లు చూచి వచ్చారు.

మద్రాసులో ఫ్లేగు ఇనస్పెక్టరు శిక్షణ పూర్తి చేసి, కొంతకాలం బళ్లారిలో ప్లేగ్ ఇనస్పెక్టరుగా పనిచేసారు. అతని జ్ఞాన దాహం అంతులేనిది. శ్రీలంక వెళ్ళి కొలంబోలోని సిటీ కాలేజీలో పొలిటికల్ ఎకనమిక్స్ ప్రత్యేక విషయంగా చదివి కేంబ్రిడ్జ్ సీనియర్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. కొంతకాలం రైల్వేలో గార్డుగా పనిచేసారు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి లాహోర్ లోని డి.ఎ.వి. కాలేజీలో చేరి, సంస్కృతం, ఉర్దూ, జపాన్ భాషల్లో మంచి పాండిత్యం సంపాదించారు. జపాన్ భాషలో అనర్గళంగా మాట్లాడే వెంకయ్య గారిని "జపాన్ వెంకయ్య" అని పిలిచేవారు.

19 ఏళ్ల వయసులో దేశభక్తితో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బోయర్ యుద్ధం లో ఉత్సాహంగా పాల్గొన్నారు. దక్షిణాఫ్రికాలో ఉండగా మహాత్మా గాంధీని కలిశారు. గాంధీతో వెంకయ్యకు ఏర్పడిన ఈ సాన్నిహిత్యం అర్ధశతాబ్దం పాటు నిలిచింది.

ఆనాటి నుండి జాతీయ జెండా ఎలా ఉండాలనే సమస్యనే తన అభిమాన విషయంగా పెట్టుకొని, దాని గురించి దేశంలో ప్రచారం ప్రారంభించారు. 1913 నుండి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై, నాయకులందరితోనూ జాతీయ పతాక రూపకల్పన గురించి చర్చలు జరిపారు. 1916లో "భారతదేశానికొక జాతీయ జెండా " అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో రాసి ప్రచురించారు. ఈ గ్రంథానికి అప్పటి వైస్రాయ్ కార్యనిర్వాహక సభ్యుడైన కేంద్రమంత్రి సర్ బి.ఎన్.శర్మ ఉత్తేజకరమైన పీఠిక రాసారు.

త్రివర్ణ పతాక ఆవిష్కరణ 

1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు. 1919లో జలంధర్ వాస్తవ్యులైన లాలా హన్స్ రాజ్ మన జాతీయ పతాకంపై రాట్న చిహ్నముంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించాru. 1921లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి. గాంధీజీ వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నంగల ఒక జెండాను చిత్రించమని కోరాru. మహాత్ముడు సూచించిన ప్రకారంగానే, ఒక జెండాను సమకూర్చాru వెంకయ్య. అనంతరం వచ్చిన ఆలోచనల మేరకు, సత్యం, అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా, వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించారు.

గాంధీజీ ప్రోద్బలంతో త్రివర్ణ పతాకం పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోనే. కాషాయ రంగు హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లింలకని పేర్కొనడంతో, ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయం వెలువడడంతో గాంధీజీ సూచనపై ఆకుపచ్చ, కాషాయ రంగులతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించారు. మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్ఫురింప చేస్తుందన్నారు. కార్మిక కర్షకులపై ఆధారపడిన భారతదేశం, సత్యాహింసలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం. ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం.

1947, జూలై 22 వ తేదీన భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ, మునుపటి త్రివర్ణ జెండాలోని రాట్నాన్ని తీసేసి, దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. అశోకుని ధర్మచక్రం మన పూర్వ సంస్కృతికి సంకేతం.

జాతీయ ఉద్యమంలో పాత్ర 

పింగళి వెంకయ్య 1906 నుంచి 1922 వరకు భారత జాతీయోద్యమంలోని వివిధ ఘట్టాలలో పాల్గొన్నారు. వందేమాతరం, హోమ్‌రూల్ ఉద్యమం, ఆంధ్రోద్యమంలాంటి ప్రసిద్ధ ఉద్యమాలలో ప్రధాన పాత్రధారిగా ఉన్నారు.  భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన బెంగుళూరు, మద్రాసు లలో రైల్వే గార్డుగా పనిచేశారు.  ఆ తరువాత కొంత కాలము బళ్లారిలో ప్లేగు అధికారిగా ప్రభుత్వ ఉద్యోగము చేశారు.  వెంకయ్యలో ఉన్న దేశభక్తి ఆయనను ఎంతో కాలము ఉద్యోగము చేయనివ్వలేదు. జ్ఞానసముపార్జనాశయముతో లాహోరు లోని ఆంగ్లో - వేదిక్ క‌ళాశాలలో చేరి ఉర్దూ, జపనీస్ భాషలను నేర్చుకున్నారు.  ఈయన ప్రొఫెసర్ గోటే ఆధ్వర్యములో జపనీస్, చరిత్ర అభ్యసించారు. 

'పత్తి' వెంకయ్య 

1906 నుండి 1922 వరకు జాతీయోద్యమాలతో పాటు మునగాల పరగణా నడిగూడెంలో జమీందారు రాజా బహదూర్ నాయని రంగారావు కోరిక మేరకు నడిగూడెంలో నివాసము౦డి పత్తి మొక్కలలోని మేలు రకముల పరిశోధనలో వినియోగించాru. నడిగూడెంలో వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించారు.  ఈ పరిశోధనలలో కంబోడియా పత్తి అను ఒక ప్రత్యేక రకమైన పత్తి మీద విశేష కృషి చేశారు.  ఈయన కృషిని ఆనాటి బ్రిటీషు ప్రభుత్వము కూడా గుర్తించడముతో ఈయనకు పత్తి వెంకయ్య అని పేరు వచ్చింది. నడిగూడెంలోనే నేటి ఈ త్రివర్ణ పతాకాన్ని రూపొందించి స్థానిక రామాలయములో పూజలు నిర్వహించి 1921 మార్చి31, ఏప్రిల్1వ తేదీలలో బెజవాడలోని కాంగ్రెస్ మహాసభలో సమర్పించారు. 

‘డైమండ్’ వెంకయ్య 

జియాలజీలో పట్టభద్రుడైన ఆయన ఆంధ్రప్రదేశ్‌లో వజ్రాల తవ్వకాలలో రికార్డు సృష్టించారు. అందుకే ఆయనను 'డైమండ్ వెంకయ్య' అని పిలిచారు. నెల్లూరు చేరి 1924 నుండి 1944 వరకు అక్కడే ఉంటూ మైకా (అబ్రకం) గురించి పరిశోధన చేశారు.  వజ్రకరూరు, హంపి లలో ఖనిజాలు, వజ్రాలు గురించి విశేషంగా పరిశోధనలు జరిపి ప్రపంచానికి తెలియని ‘‘వజ్రపు తల్లిరాయి’’ అనే గ్రంథం రాసి 1955లో దాన్ని ప్రచురించారు.  దేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత ప్రభుత్వం వెంకయ్యను ఖనిజ పరిశోధకశాఖ సలహాదారుగా నియమించింది. ఆ పదవిలో ఆయన 1960 వరకు పనిచేసారు.  అప్పటికి ఆయన వయస్సు 82 సంవత్సరాలు.

విద్య, శాస్త్రీయరంగాలలో సేవలు 

వెంకయ్య బందరు లోని జాతీయ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు.  వ్యవసాయ శాస్త్రం, చరిత్రలతో పాటు విద్యార్థులకు గుర్రపుస్వారీ, వ్యాయామం, సైనిక శిక్షణ ఇచ్చేవారు.  అప్పట్లో చైనా జాతీయ నాయకుడైన 'సన్ యత్ సేన్ ' జీవిత చరిత్ర వ్రాశారు. 

ఆఖరి సంవత్సరాలు 

వృద్ధాప్యంలో ఆర్థిక బాధలు ఆయనను చుట్టుముట్టాయి. మిలటరీలో పనిచేసినందుకు విజయవాడ చిట్టినగరులో ప్రభుత్వం ఇచ్చిన స్ధలంలో ఆయన గుడిసె వేసుకొని దారిద్ర్య జీవితాన్ని గడపవలసి వచ్చింది. ఆయన ఏనాడూ ఏ పదవినీ ఆశించలేదు. కాని ఆయన నిస్వార్థ సేవను ప్రభుత్వం గుర్తించకపోవడం విచారకరం. మన జాతికొక కేతనాన్ని నిర్మించాడాయన. ఇతర దేశాలలో జాతీయ పతాక నిర్మాతలను ఆ ప్రభుత్వాలు ఎంతగానో గౌరవిస్తాయి. వారికి కావలసిన వసతులను ప్రభుత్వాలే ఉచితంగా సమకూరుస్తాయి. మన ప్రభుత్వం వెంకయ్యని గుర్తించకపోవటం శోచనీయం, జాతీయ పతాకాన్ని గురించి ప్రభుత్వం ప్రచురించిన పుస్తకంలో, మన పతాక నిర్మాత ఒక తెలుగువాడు అని వ్రాశారే కాని, వెంకయ్య పేరుని సూచించకపోవడం విచారకరం.

తెలుగువారు తమ వారిని గౌరవించటంలో ఏనాడూ ముందంజ వేయలేదు. జీవితాంతం దేశం కొరకు, స్వాతంత్ర్యం కొరకు పోరాడిన వెంకయ్య చివరి రోజుల్లో తిండికి కూడా మొహం వాచి నానా అగచాట్లు పడినట్లు ' త్రివేణి ' సంపాదకులు డా. భావరాజు నరసింహారావు పేర్కొన్నారు. అంతిమదశలో విజయవాడలో డా. కె.ఎల్.రావు, డా.టి.వి.ఎస్.చలపతిరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు మున్నగు పెద్దలు 1963 జనవరి 15న వెంకయ్యను సత్కరించి వారికి కొంత నిధిని అందించారు. ఆ సత్కారం తరువాత ఆరు నెలలకే 1963, జూలై 4 న వెంకయ్య దివంగతుడయ్యారు. 

కన్నుమూసేముందు ఆయన చివరి కోరికను వెల్లడిస్తూ " నా అంత్య దశ సమీపించింది. నేను చనిపోయిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని నా భౌతిక కాయంపై కప్పండి. శ్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకం తీసి అక్కడ ఉన్న రావి చెట్టుకు కట్టండి. ఇది నా తుది కోరిక " అన్నారు. 

జాతీయ పతాకం ఎగిరే వరకు స్మరించుకోదగిన ధన్యజీవి పింగళి వెంకయ్య. నిరాడంబరమైన, నిస్వార్థమైన జీవితం గడిపిన మహామనీషి పింగళి వెంకయ్య. ఆయనను ప్రజలు మరచిపోతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాదులో ట్యాంక్ బండ్ పై ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి ఆయన దర్శన భాగ్యం ప్రజలకు లభింపజేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)